దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం తగ్గడం లేదు.
వ్యాక్సిన్ కొరతతో ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగలేదు.పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు విధించి కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు.
దేశంలో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు మాత్రమే అందుబాటులో ఉండగా తాజాగా స్పూత్నిక్-వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.
అయినా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు.ఇప్పుడు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది.
దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారిని తలచుకుని కంటతడి పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యూపీలోని వారణాసికి చెందిన డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.కరోనా క్లిష్ట సమయాల్లో డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేస్తున్న సేవలను, చూపిస్తున్న ధైర్యాన్ని, చేస్తున్న కృషిని ప్రధాని మోడీ అభినందించారు.
కరోనా కారణంగా దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కంటతడి పెట్టారు.మన చుట్టు పక్కనే ఉన్న చాలా మంది కరోనాతో మృతిచెందారు.
వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను.డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య రాజ్యసభలో కూడా భావోద్వేగానికి గురయ్యారు.కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ గురించి మాట్లాడేటప్పుడు ప్రధాని మోదీ కంటతడి పెట్టారు.