ఇండియాలో మహాత్మా గాంధీ అంటే జాతిపిత.భారతదేశఃలో పుట్టిన ప్రతి ఒక్కరూ గాంధీని తలుస్తూనే ఉంటారు.
అందరికీ ఆయనంటే గౌరవమే.అంత గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న గాంధీని ఓ ఊరు మాత్రం దేవుడిగా పూజిస్తోంది.
అన్ని ఊర్లలాగానే ఆ ఊరి నడిబొడ్డున మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేశారు.అయితే ఈ విగ్రహం దగ్గర పూజలు జరుగాయంటే ఎవ్వరూ నమ్మలేరు.
కానీ ఇదే నిజం.ఊర్లో ఎవరింట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా సరే గాంధీ విగ్రహానికి అభిషేకాలు, పూజలు చేయకుండా ఊరుకోరు.
ఆ ఊరు ఎక్కడో లేదండోయ్.మన నిజామాబాద్ జిల్లాలో ఉండే డిచ్ పల్లి మండలానికి చెందినటువంటి నర్సింగాపూర్ లో ఈ ఆచారం కొనాసగుతోంది.దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్ముడే తమకు దైవ సమానమని, అందుకే ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు వారంతా కూడా.ఎవరికి వివాహం అయినా లేదంటే సంతానం కలిగినా సరే వారు కచ్చితంగా గాంధీ విగ్రహానికి నిష్టగా పూజలు చేస్తారంట.
అంతే కాకుండా తమ గ్రామంలో వర్షాల కోసం గాంధీ విగ్రహానికి వారు జలాభిషేకం చేస్తారంటే ఎంత విచిత్రమో చూడండి.

ఈ గ్రామంలో 1961వ సంవత్సరంలో విగ్రహాన్ని ప్రతిష్టించగా అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ విగ్రహానికి పూజలు చేస్తూనే ఉన్నారు.గాంధీ అంటే తమకు దేవునితో సమానమని, అందుకే ఇలా పూజిస్తామంటూ చెబుతున్నారు గ్రామస్తులు.తమ గ్రామంలో తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని, ఎంత అభివృద్ధి చెందినా కూడా తాము దీన్ని వదలబోమంటూ చెబుతున్నారు.
నగరాల్లో నివాసం ఉంటున్న గ్రామస్తులు కూడా ఊరికి వస్తే తప్పకుండా గాంధీ విగ్రహానికి పూజలు చేస్తారని తెలుస్తోంది.ఏదేమైనా ఈ ఆచారం చాలా విచిత్రంగా ఉంది కదూ.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.