కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఎన్ని కష్టాలు పడిందో మాటల్లో చెప్పక్కర్లేదు.ఏడాదికి పైగా కరోనా వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు.
కరోనా మహమ్మారిని తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టారు.ఎట్టకేలకు మన దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పెట్టిందనే చెప్పాలి.
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.గతంలో కరోనా కేసులు అధికంగా నమోదు అవ్వడంతో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి.
అలాగే చాలా రకాల ఆంక్షలు కూడా పాటించారు.ప్రస్తుతం అన్ లాక్ దశలో ఉండగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ మళ్ళీ యధావిధిగా తెరుచుకున్నాయి.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విధులపై కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 8వ తేదీ నుంచి అంటే నేటి నుంచి కోవిడ్ కారణంగా ఉద్యోగులకు అందించిన అన్ని సౌకర్యాలను తొలగిస్తున్నట్లు తెలిపింది.
అంటే కోవిడ్ సమయంలో ఆఫీస్ లకు లిమిటెడ్ సంఖ్యలోనేఉద్యోగులు హాజరయ్యారు.అలాగే ఆఫీస్ సమయాన్ని తగ్గించినట్లు కేంద్రం తెలిపింది.కానీ ఈ రోజు నుంచి అలాంటి సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు, కొత్త నిబంధనలు ఈరోజు నుంచి అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ తెలిపారు.అలాగే కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల కోసం కొన్ని ముందస్తు సూచనలు కూడా జారీ చేసారు.
ప్రతి ఉద్యోగి ఆఫీస్ కి రాగానే తప్పనిసరిగా శానిటైజింగ్ చేసుకోవాలి.అలాగే ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు నమోదు సమయంలో గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ బయోమెట్రిక్ వేయాలి.ఉద్యోగులు విధుల్లో ఉన్నన్ని గంటలు మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి.బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ ప్రదేశంలో ఉంచి, బయోమెట్రిక్ టచ్ప్యాడ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.ఒక వేళ బయోమెట్రిక్ యంత్రం కార్యాలయం లోపల ఉన్నట్లయితే తగినంత వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు వహించాలి.ప్రతి ఉద్యోగి కూడా కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తూ తమ పనులు బాధ్యతగా నిర్వర్తించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.