తమ కంపెనీ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) భారత సాయుధ దళాల కోసం “ఆర్మడో”( Armado ) అనే వాహనాన్ని డెలివరీ చేయడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) తాజాగా ప్రకటించారు.ఆర్మడో అనేది వివిధ సైనిక కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక రకమైన సాయుధ వాహనం.
దీనిని ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్గా కంపెనీ పిలుస్తోంది.
ప్రమాదకరమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్, ప్రత్యేక దళాల మిషన్లు వంటి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఆర్మడోను ఉపయోగించవచ్చు.
ఆయుధాలను మోసుకెళ్లడం, నిఘా నిర్వహించడం, సరిహద్దు ప్రాంతాలు లేదా ఎడారి భూభాగాల్లో భద్రతను అందించడం వంటి విభిన్న ఉపయోగాల కోసం కూడా దీనిని మిలిటరీ వారు వినియోగించవచ్చు.
చాలా దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనం శక్తివంతమైన 3.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్తో వస్తుంది.ఈ ఇంజన్ 215 హార్స్పవర్, 500 న్యూటన్-మీటర్ల టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది.
చూసేందుకు కాస్త పెద్దగా ఉన్నా ఇది గంటకు 120 కిలోమీటర్లకు పైగా స్పీడ్తో దూసుకెళ్లగలదు.అంతేకాదు, ఇది ఏకంగా 1,000 కిలోగ్రాముల వరకు పేలోడ్ను మోయగలదు.ఆర్మడో వెహికల్లో ఆరు నుంచి ఎనిమిది మంది సైనికులు ఒకేసారి ప్రయాణించవచ్చు.
ఈ స్పెషల్ మిలిటరీ వెహికల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, GPS, ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, అధునాతన రేడియో కమ్యూనికేషన్ వంటి మిలిటరీకి ఉపయోగపడే ఫీచర్లు చాలానే ఉన్నాయి.మహీంద్రా గ్రూప్ భారతీయ సాయుధ దళాల కోసం ఆర్మడో వాహనాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.భద్రత, కమ్యూనికేషన్ రెండింటికీ ఇది ఉత్తమంగా నిలుస్తుందని దాని ఫీచర్లను బట్టి చెప్పవచ్చు.