చాలా కాలంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.పిసిసి అధ్యక్షుడి నియామకం చేపట్టాలి అంటే ప్రశాంతంగా ఉన్న తేనె తుట్టుని కదపడమే అన్న విషయం కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు.
అందుకే ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోంది.తాజాగా జరిగిన ఎన్నికలు , దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపించక పోవడంతో, దానికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పదవిలో ఎవరో ఒకరు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే కొత్త నేత ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.పార్టీలో నాయకులతో పాటు, డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు అందరి అభిప్రాయసేకరణ చేశారు.ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ల పేర్లు బాగా ప్రచారం జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై నిన్న కీలకంగా చర్చించారు.అయితే ఆ సమావేశం నుంచి బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో ఆయన కాబోయే పిసిసి అధ్యక్షుడు అనే హడావుడి నడిచింది.
కానీ మాణిక్యం ఠాకూర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పార్టీ లోని మెజారిటీ నాయకులు రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇవ్వాలని సూచించడం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటివారు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రేవంత్ కు ఆ పదవి రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీరిలో ఒకరికి పదవి వచ్చేలా చేసి రేవంత్ దూకుడుకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ డెసిషన్ ఏమిటనేది ఈ రోజు మాణిక్యం ఠాకూర్ అందించే నివేదిక ఆధారం గా తేలిపోతోంది.