ఇసుక కృత్రిమ కొరతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెరలేపిందని ఆరోపిస్తూ రవీంద్ర 36 గంటలపాటు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
వైఎస్సార్సీపీ నేతల జేబులు నింపేందుకే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని, ఇసుక కొరతకు నిరసనగా నగరంలోని కోనేరు సెంటర్లో దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆయన దీక్ష కు దిగే ముందే పోలీసులు అరెస్ట్ చేయడం తో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడకి వచ్చిన మీడియా తో మాట్లాడుతూ శాంతియుతంగా ఇసుక కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారని కోళ్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలను రోడ్డు మీదకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
సమస్యలపై పోరాడనీయకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ జగన్ సర్కార్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది అని అన్నారు.కొల్లు రవీంద్ర అరెస్ట్ తో మచిలీపట్నం లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
అయితే తన దీక్షను పోలీసులు భగ్నం చేసినా తిరిగి మరలా దీక్ష చేపడతానని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.