తెలంగాణాలో ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసిన రెబెల్స్ బెడద కాంగ్రెస్ పార్టీకి కూడా పాకింది.టీఆర్ఎస్ లో నెలకొన్న ఆ పరిణామాలు తమకు కలిసి వస్తాయనే ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే ఆ స్ట్రోక్ తగలడంతో… ఆ ఆనందం కాస్తా ఆవిరయిపోతోంది.
ముఖ్యంగా కూటమిలో ఉన్న మిత్ర పక్ష పార్టీకాలు సీట్లు సర్దుబాటు చేసే క్రమంలో కొన్ని సీట్లను పొత్తులో భాగంగా వారికి కేటాయిస్తోంది.అయితే అక్కడ పార్టీని నమ్ముకుని కష్టపడ్డ నాయకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
పొత్తుల్లో భాగంగా దాదాపు 30 పైచిలుకు సీట్లను త్యాగం చేయాల్సి రావడంతో…కాంగ్రెస్ కు ఇక్కడ సొంత పోరు తప్పడంలేదు.
తెలంగాణాలో అన్ని పార్టీలకంటే బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోడం అంటే ఆషామాషీ కాదు.కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్తే… చతికలపడాల్సిందే.ఆ విషయం అర్ధమయ్యే మహాకూటమి ఏర్పాటు చేసి టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నిటి కలుపుకుని ఎన్నికల బరిలోకి వెళ్తోంది.
ఈ క్రమంలోనే వారికోసం కాంగ్రెస్ కొన్ని సీట్లను థయాగం చేస్తోంది.కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షాలకు ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిందే.
మరి అన్ని సీట్లను త్యాగంచేస్తే పార్టీలో టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్న నాయకులు ఊరికే ఉంటారా? కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు.అయితే కాంగ్రెస్ పొత్తు అంటూ ఈ సీట్లను త్యాగం చేసేస్తే వాళ్లు రెబల్స్ గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కొంతమంది నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం పై రగిలిపోతున్నారు.
మిత్రపక్షాలకు కేటయిస్తున్న సీట్లపై ఇప్పటికే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు తమ పరిస్థితి ఏంటని రాష్ట్ర నాయకులను నిలదీస్తున్నారు.కొంతమంది రెబల్ గా బరిలోకి దిగేందుకు తమ అనుచరులతో సమావేశాలు పెడుతున్నారు.ఈ ఊహించని పరిణామంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గందరగోళంలో పడిపోయింది.
ఇప్పుడిప్పుడే మొదలయిన ఈ అసంతృప్తిని తగ్గించేందుకు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.