యాదాద్రి భువనగిరి జిల్లా: పేదల కష్టం తెలిసిన నిబద్దతగల నాయకుడు జహాంగీర్ ను భువనగిరి ఎంపీగా అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్ షో కు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
దేశంలో పాలన కొనసాగించిన బీజేపీ ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసే కుట్ర పన్నుతుందన్నారు.
మమ్మల్ని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే చెప్పడం దేశం ప్రమాదంలోకి వెళుతుందనటానికి సంకేతమన్నారు.
బీజేపీ యేతర ప్రభుత్వాలను రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని భయబ్రాంతులకు గురిచేస్తూ, జైళ్ళకు పంపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.బీజేపీ ప్రమాదాన్ని ప్రజలు పసిగట్టకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను అంధకారంలోకి నేడుతుందన్నారు.
మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రేపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.రైతు,కార్మిక వ్యతిరేక చట్టాలతో ఆదాని, అంబానిలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తుందని,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే బీజేపీని ఎండగట్టేందుకు ప్రస్తుతం పార్లమెంటులో కమ్యూనిస్టుల అవసరం ఉన్నదని,బీజేపీని నిలువరించే బాద్యత సిపిఎం భుజాలపై ఎత్తుకుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న భువనగిరి పార్లమెంటుకు గత 35 ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో ఉన్న జహాంగీర్ ను సిపిఎం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని,నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే జహాంగీర్ ను,డబ్బు సంచులతో వచ్చే ఇతర పార్టీల అభ్యర్థులను ప్రజలు గమనించి ఓటు వేసి గెలిపించాలన్నారు.జహాంగిర్ గెలుపుతోనే గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్దిలో వెనకబాటుకు గురవుతున్న రామన్నపేట అభివృద్ది సాధ్యమని,ఈ ప్రాంత సమస్యలు తెలిసిన జహాంగీర్ తో మీలో ఒకడిగా ఉంటాడని తెలిపారు.
సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గతంలో రామన్నపేట నియోజకవర్గంగా ఉండి అనేక డివిజనల్ ప్రభుత్వ ఆఫీసులు ఉన్నా ప్రస్తుతం ఒక్కొక్కటీ మాయమవుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఆసపత్రికి 50 ఏళ్లు దాటి శిధిలావస్థకు చేరిందని, ముప్పై మంది డాక్టర్లకు ముగ్గురు కూడా లేరని,అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాంతం అభివృద్ది కావాలంటే జహాంగీర్ గెలవాలన్నారు.
ఈ రోడ్ షో లో ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన రాజకీయ చైతన్య గీతాలు సభికులను ఉర్రూతలూగించాయి.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు తుమ్మల వీరారెడ్డి,పైళ్ళ ఆషయ్య,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి,కల్లూరి మల్లేషం, ఆనగంటి వెంకటేశం,జిల్లా కమిటి సభ్యులు జల్లల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు కూరెళ్ళ నర్సింహ్మచారి,మామిడి వెంకట్ రెడ్డి,ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్,జిల్లా అధ్యక్షుడు గంటేపాక శివ కుమార్,వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్,బోయిని ఆనంద్, గాదె నరేందర్,మీర్ ఖాజావలి, కల్లూరి నగేష్,కందుల హనుమంతు,నీల అయిలయ్య,ఎండి రషిద్, జంపాల అండాలు తదితరులు పాల్గొన్నారు.