సింగపూర్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ బిజిబిజీగా గడుపుతున్నారు.
ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ఆ దేశ విద్యా శాఖ సెకండ్ మినిస్టర్ మాలికీ బిన్ ఉస్మాన్తో సోమవారం మురళీధరన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రవాస భారతీయుల సమస్యలు, తదితర అంశాలపై చర్చలు జరిపారు.దీనికి సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.
మురళీధరన్ ఫిబ్రవరి 18 నుంచి ఆస్ట్రేలియా, సింగపూర్లలో పర్యటిస్తున్నారు.రేపటితో ఆయన విదేశీ పర్యటన ముగియనుంది.

గత ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఆ దేశ విద్య, ఆదివాసుల వ్యవహారాలు, పౌరసత్వం , బహుళ సాంస్కృతిక ప్రయోజనాల శాఖ మంత్రి టోనీ బుటి, పశ్చిమ ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఎంపీలతోనూ మురళీధరన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్య, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశాలపై చర్చించారు.అంతకుముందు ఆయన శనివారం మెల్బోర్న్లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.ఆస్ట్రేలియాతో భారత్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గాను ఎన్ఆర్ఐలను మురళీధరన్ ప్రశంసించారు.ఈ భేటీకి సంబంధించి కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.మెల్బోర్న్లోని ప్రవాస భారతీయులతో సంభాషించడం ఆనందంగా వుందన్నారు.
వారి సహకారానికి అభినందనలు తెలియజేసినట్లుగా మురళీధరన్ ట్వీట్లో పేర్కొన్నారు.

ఇకపోతే.ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఫిజిలో భారత్-ఫిజీ ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన 12వ ప్రపంచ హిందీ సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో కలిసి మురళీధరన్ పాల్గొన్నారు.ఆ తర్వాత కేంద్ర మంత్రులిద్దరూ నాడిలోని శ్రీ శివ సుబ్రమణ్య కోవిల్ను సందర్శించారు.
ఇక సువా పర్యటన సందర్భంగా ఫిజీ మ్యూజియంలో పునర్నిర్మించిన గిర్మిట్ గ్యాలరీని జైశంకర్ ప్రారంభించారు.దీనికి ద్వైపాక్షిక గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద భారత ప్రభుత్వం మద్ధతుగా నిలిచింది.
అలాగే సువాలోని ఇండియా హౌస్లో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా జైశంకర్ ఆవిష్కరించారు.ఇదే సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించారు.