లజ్జ ఫేమ్ వరుణ్ ఇంటర్వ్యూ….
కొందరు వ్యాపారం కోసం సినిమాలు తీస్తారు.మరి కొందరు అభిరుచి కోసం సినిమాలు తీస్తారు.ఇంకొందరు మేము కూడా సినిమా తీసాం అనిపించుకోవాలని కూడా తీస్తారు.కానీ కొందరే అఖండ ప్రతిభను కనపరుస్తూ తాను సినిమా చేస్తే అది సంచలనమై తీరాలనే కాంక్షతో సినిమా తీస్తారు.లాంటి వ్యక్తే దర్శకుడు నరసింహనంది.2008 వ సంవత్సరంలో ‘1940లో ఒక గ్రామం’ అనే సినిమా తీసి 2009లో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని పొందాడు.అ తర్వాత 2013 లో ‘కమలతో నా ప్రయాణం’ అనే సినిమాకు కూడా సరికొత్తగా కథాంశంతో తెరకెక్కించాడు.
అదే కోవలో ఇప్పుడు ‘లజ్జ’ అనే పేరుతో సరికొత్త కోణంలో ఓ ఫ్యామిలీ డ్రామాను ఆవిష్కరించారు.నూతన తారాగణంతో ఇలాంటి ప్రయోగాలు చేయడంలో సరసింహనందికి కొత్తే అయినా సరికొత్త కోణంలో తీసిన చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది.ఆ చిత్రంలోని ఇద్దరు హీరోలలో ఒకరైన వరుణ్ తో ఏప్రిల్ 2న బర్త్ డే సందర్భంగా ఇంటర్య్వూ .
మీ గురించి చెప్తారా?
నేను వరంగల్ జిల్లాలోని హనుమకొండలో పుట్టాను.నా చిన్ననాటి చదువు అంటే 8వ తరగతి వరకు వరంగల్లోనే జరిగింది.ఆ తర్వాత అక్కడ నుండి నా చదువు మొత్తం హైదరాబాద్లోనే జరిగింది.
సినీ రంగానికి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నేను 10 వ తరగతి చదువుతున్నప్పుడే నాకు సినిమా ఆఫర్స్ వచ్చాయి.అంటే మా నాన్నగారు వ్యాపారం చేస్తుంటారు.
అలా వ్యాపారరీత్యా సినిమాకు సంబంధించిన వాళ్ళతో పరిచయాలు బాగా వుండేవి.అబ్బాయి బాగున్నాడు, సినిమా రంగంలోకి తీసుకురావచ్చు కదా అని అడిగేవారు.
నాకూ చిన్నప్పటినుండి సినిమా హీరో కావాలనే కోరిక వుండేది.ఆ కోరికతోనే సినిమాలు ఎక్కువగా చూసేవాడ్ని.
నేను ఇంటర్లో వున్నప్పుడు వెంకట్ మాగులురి అనే డైరెక్టర్తో నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను.దాని తర్వాత నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫ్రెండ్స్ అంతా చాలా మెచ్చుకొన్నారు.ఆ షార్ట్ ఫిల్మ్ చేయడం వల్లనే ఆర్.
పి.పట్నాయక్ గారి ‘మనలో ఒక్కడు’ సినిమాలో ఆఫర్ వచ్చింది.
‘లజ్జ’ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది?
నేను ఆర్.పి.పట్నాయక్ గారి ‘మనలో ఒక్కడు’ మూవీ చేస్తున్నప్పుడే నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా నరసింహ నంది గారిని కలవడం జరిగింది.ఆర్.
పి.పట్నాయక్ గారి సినిమా చేస్తున్నప్పుడే ‘లజ్జ’ మూవీలో కూడా చేసాను.కానీ ‘మనలో ఒక్కడు’ మూవీ డిలే అవడం మూలంగా ‘లజ్జ’ మూవీ నా మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో నేను సమీర్ అనే క్యారెక్టర్ చేశాను.‘మనలో ఒక్కడు’లో కూడా కాలేజి స్టూడెంట్గా సెకండ్ లీడ్ రోల్ చేశాను.
మీ తర్వాత ప్రాజేక్ట్స్ ఏంటి?
నేను ప్రస్తుతం ఇంకో రెండు మూవీస్లో చేస్తున్నాను.‘లజ్జ’ డైరెక్టర్ నరసింహనంది గారి దర్శకత్వంలోనే రూపొందుతున్న ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ అనే సినిమాలో కూడా చేస్తున్నాను.
మీరు చేసిన రెండు సినిమాల దర్శకులు కూడా ఓ డిఫరెంట్ జోనర్లో సినిమాలు తీసేవారే కదా.వాళ్ళతో మీ జర్నీ ఎలా వుంది?
అవును.నరసింహ నంది గారి సినిమాలు గానీ, ఆర్.పి.పట్నాయక్ సినిమాలు గానీ సమాజానికి దగ్గరగా వుండే సినిమాలే.సమాజంలో నిత్యం జరిగే ఎన్నో విషయాలలో నుంచి ఒక చిన్న పాయింట్ని తీసుకొని వాళ్ళు సినిమాలు చేస్తారు.నాకు అలాంటి డిఫరెంట్ సినిమాలు చేయడంలోనే ఎంతో ఉత్సాహం వుంటుంది.
‘మనలో ఒక్కడు’ సినిమాలో మూడు షేడ్స్ వుండే పాత్ర చేసాను.అందులో నెగటివ్ షేడ్ కూడా వుంది.
అంటే మీరు ఇలాంటి నెగటివ్ షేడ్స్ వున్న సినిమాలే చేస్తారా?
అలా అని ఏం కాదు.ఏ పాత్రనైనా సమర్ధవంతంగా చేయగల సామర్ధ్యం నాకుంది.
ఏ పాత్రకైనా నేను చక్కగా న్యాయం చేయగలను.పాత్ర నచ్చాలే కానీ ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేయగలననే నా మీద నాకు నమ్మకం.
సినిమా హీరో కావాలనే మీ కోరికను ఇంట్లో వారు సపోర్ట్ చేశారా?
అవునండీ .మా నాన్న గారు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.నేను బి.టెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను.హీరో కావాలన్న నా కోరిక ఎంత ముఖ్యమో అలాగే చదువు కూడా అంతే ముఖ్యం.చదువు విలువ కూడా నాకు తెలుసు.అందుకే మా ఇంట్లో వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.
డాన్స్, ఫైట్స్, నటనలో ఏమైనా అనుభవం వుందా?
అనుభవం అంటే ఇవన్నీ నేను ఇస్టిట్యూట్లో చేరి నేర్చుకున్నాను.కాబట్టి అన్నీ చెయ్యగలను.నేను ఏ పని చేసినా పూర్తిగా నిమగ్నమై చేయడం నాకు అలవాటు.అందుకే ఎంత కష్టమైన పనినైనా చేయగలననే నమ్మకం నాకు వుంది.
మీ తరువాత సినిమా ఎప్పుడు మొదలౌతుంది?
ప్రస్తుతం ‘మనలో ఒక్కడు’ జరుగుతుంది.మే ఫస్ట్ వీక్లో ఇంకో కొత్త సినిమా మొదలౌతుంది.‘బుడ్డారెడ్డిపల్లె బ్రేకింగ్ న్యూస్’ సినిమాలో విలేజ్ లవర్ బాయ్గా చేస్తున్నాను.నాకు డిఫరెంట్ గా వుండే క్యారెక్టర్స్ చేయడమంటేనే ఎక్కువ ఇష్టం.
మీకు ఇంకా ఇండస్ట్రీలో వున్న ఏ డైరెక్టర్తో చేయాలని వుంది?
నాకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో చేయాలని వుందంటూ మనసులోని మనోభావాలను మనతో పంచుకున్నారు ‘లజ్జ’ హీరో వరుణ్
.