కరోనా కల్లోలం సృష్టించడంతో చాలా మంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి.జీవితాలు తల్లకిందులై చాలా మంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు.
చాలా మంది ఆస్తులు హరించుకుపోయాయి.ఈ తరుణంలో ఆశ్చర్యకరమైన విషయం బయటికొచ్చింది.
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో భారతీయులు భారీగా సంపాదన పెంచుకున్నట్లు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల నుండి రూ.1000 కోట్లు అంత కంటే ఎక్కువ సంపాదించిన 78 మందికి పైగా వ్యక్తులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఏపీ, తెలంగాణ నుంచి ఇంత మంది కోటీశ్వరులు ఉన్నారని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ జాబితాలో వ్యక్తుల సంచిత సంపద గతేడాదితో పోలిస్తే 3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హురున్ రిపోర్ట్ ఇండియా మరియు ఐఐఎఫ్ఎల్ వెల్త్ కలిసి ‘IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022’ యొక్క 2022 ఎడిషన్ నివేదికను ఆవిష్కరించాయి.ఇందులో ఎంఎస్ఎన్ లేబొరేటరీస్, సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ మరియు విర్చో లేబొరేటరీస్ వరుసగా రూ.20,600 కోట్లు, రూ.4,800 కోట్లు, రూ.5,300 కోట్లు సంపాదనతో ఉన్నాయి.రూ.8,700 కోట్ల సంపదతో, మహిమా దాట్ల కుటుంబం (బయోలాజికల్ ఈ కంపెనీ) జాబితాలో ఉన్న అత్యంత సంపన్న మహిళ.హైదరాబాద్ నుంచి 64 మంది, విశాఖపట్నం నుంచి 5 మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 3 మంది ఈ జాబితాలో ఉన్నారు.దివీస్ లేబొరేటరీస్కు చెందిన మురళీ దివి కుటుంబం రూ.56,200 కోట్ల సంపదతో (ఏపీ & తెలంగాణ) అగ్రస్థానంలో ఉన్నారు.హెటెరోకు చెందిన బి పార్థసారధి రెడ్డి రూ.39,200 కోట్లతో రెండవ స్థానంలో, రూ.16,000 కోట్లతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్కు చెందిన ఎం సత్యనారాయణ రెడ్డి మూడవ స్థానంలో ఉన్నారు.రెండు రాష్ట్రాల్లోని టాప్ 10 సంపన్నులలో ఆరుగురు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారంలో ఉన్నారు.