అధికార దుర్వినియోగానికి పాల్పడిన అభియోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అమెరికా దిగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజేంటేటివ్స్) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా నలుగురు భారత సంతతి అమెరికన్లు ట్రంప్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
బుధవారం రాత్రి దిగువ సభ అధ్యక్షుడిని రెండు అంశాలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది.
ఒకటి అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు, రెండోది కాంగ్రెస్ను అడ్డుకున్నందుకు.
ఓటు వేసిన భారతీయులలో ప్రమీల జయ్పాల్, రాజా కృష్ణమూర్తి, అమీ బేరా, రో ఖన్నాలు ఉన్నారు.ఓటు వేసిన కొద్దిసేపటికి ప్రమీల జయపాల్ ట్వీట్ చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ గతంలో ఒకసారి విదేశీ జోక్యాన్ని కోరారని, మరోసారి అలాగే చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు.జవాబుదారీతనం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటానికి తాను ఈరోజు ట్రంప్ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్లు ఆమె తెలిపారు.
తన జీవితంలో ఇలాంటి రోజు ఊహించలేదని, బుధవారం రాత్రి అభిశంసనకు అనుకూలంగా ఓటు వేసినందుకు తనకు ఆనందంగా లేదన్నారు.అయితే రాజ్యాంగాన్ని రక్షించడానికి తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఓటు వేశానని మరో ఎంపీ రాజా కృష్ణమూర్తి ట్వీట్ చేశారు.ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 230 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి.ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.
దీంతో డొనాల్డ్ ట్రంప్ సెనేట్లో విచారణ ఎదుర్కోనున్నారు.అక్కడ కూడా ఈ తీర్మానం ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది.
సెనేట్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో ఆయన అభిశంసనకు గురయ్యే అవకాశాలు దాదాపు వుండవు.