వైసీపీలో ఇప్పటికే మంత్రి మండలి ఏర్పాటుకు సంబంధించిన వార్తలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సందడి వాతావరణం నెలకొంది .మరికొద్ది రోజుల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల విషయంలోనూ ఇదే రకమైన సందడి వాతావరణం కనిపిస్తోంది.
ఏప్రిల్ చివరి వారంలో ఏపీలో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.దీంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాల్లో జగన్ ఎవరికి కేటాయించబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి.దీంతో ఇప్పటికే కొన్ని పేర్లను జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలోనూ సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ నుంచి పదవీ కాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యుల వివరాలు పరిశీలిస్తే.
సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ , విజయసాయిరెడ్డి స్థానాలు ఖాళీ అవుతున్నాయి.విజయసాయిరెడ్డికి మళ్లీ జగన్ రాజ్యసభ అవకాశం ఇస్తారు .ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున రాజకీయ చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో విజయసాయి రెడ్డి పేరును జగన్ ఎంపిక చేశారట. మరో స్థానంలో చిలకలూరిపేట కు చెందిన వైసిపి సీనియర్ నాయకుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ పోటీ చేసేందుకు ప్రయత్నించినా, అక్కడ విడుదల రజిని కి అవకాశం ఇవ్వడంతో మర్రి రాజశేఖర్ త్యాగం చేయాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఆయన అసంతృప్తికి గురవడంతో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.కానీ ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ సామాజిక వర్గాల లెక్కల్లో అవకాశం ఇవ్వలేకపోయారు.దీంతో ఇప్పుడు మర్రి కి రాజ్యసభ స్థానాన్ని ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం .ఇక మైనారిటీ కోటలో సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీకి రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ఆలీ ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల అనంతరం ఆయనకు కీలకమైన నామినేటెడ్ పదవి దక్కుతుందని అంతా భావించినా, ఇప్పుడు ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.ఇక మరో స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లీకృపారాణి పేరు వినిపిస్తున్నా, నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి సీనియర్ నాయకుడు జగన్ కు అత్యంత సన్నిహితమైన మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా జగన్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ సీటు విషయంలోనే ఇంకా సరైన క్లారిటీ రాలేదట.