రష్యా దండ యాత్రతో ఉక్రెయిన్ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.ఎక్కడ చూసినా మరణించిన సైనికులు, ధ్వంసమైన సైనిక వాహనాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ మరుభూమిని తలపిస్తోంది.
ప్రాణభయంతో పిల్లా పాపలను చేత బుచ్చుకుని కట్టు బట్టలతో ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు ఉక్రెయిన్ వాసులు.ఇదే సమయంలో ఉక్రెయిన్కు మానవతా సాయాన్ని అందజేస్తోంది అంతర్జాతీయ సమాజం.
మందులు, ఆహారం, బట్టలు, ఇతర అత్యవసర వస్తువులను ఆయా దేశాలు పంపుతున్నాయి.పలు స్వచ్చంద సంస్థలు, దాతలు కూడా ఉక్రెయిన్కు సాయం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐలు, ఇండో అమెరికన్ స్వచ్చంద సంస్థలు కూడా తమకు తోచిన విధంగా ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్నారు.తాజాగా నిధుల సేకరణ కోసం గుజరాత్కు చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం అమెరికాలోని జార్జియా, అట్లాంటాలో లైవ్ షోలు ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా గుజరాతీ జానపద గాయని గీతాబెన్ రాబరితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.
‘లోక్ దేరో’ పేరుతో నిర్వహించిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ఎన్ఆర్ఐలు సింగర్ గీతాబెన్పై డాలర్ల వర్షం కురిపించారు.దీంతో స్టేజీ మొత్తం కరెన్సీ నోట్లతో నిండి పోయింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ రెండు షోలకు అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులు సమకూరినట్లు సూరత్ ల్యూవా పటేల్ సమాజ్ (ఎస్ఎల్పీఎస్ ) వెల్లడించింది.మొత్తం 3 లక్షల డాలర్లు ( భారతీయ కరెన్సీలో దాదాపు 2.25 కోట్లు) విరాళంగా అందినట్లు పేర్కొంది.ఈ మొత్తాన్ని యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్కు అందిస్తామని ఎస్ఎల్పీఎస్ చెప్పింది.
ఇకపోతే.26 ఏళ్ల గీతాబెన్ రాబరికి భారత్ సహా పలు దేశాల్లో మంచి గుర్తింపు వుంది.ఇప్పటికే ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాల సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చారు.2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో కచేరీ చేసి అలరించారు గీతా బెన్.