ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను మాత్రం ఆగడం లేదు.కాగా తాజాగా ఓ సీరియల్ హీరోయిన్ పై దర్శకుడు మరియు అతడి కొడుకు కలిసి అత్యాచారయత్నం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే హిందీలో పలు ధారావాహికలు మరియు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా సక్సీనా ఇటీవలే తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ తనపై జరిగినటువంటి అకృత్యం గురించి తెలిపింది.ఇందులో భాగంగా కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు సినిమా ఆఫర్ ఇస్తానంటూ తన వద్దకు వచ్చాడని అయితే ఈ చిత్రంలో ఆ దర్శకుడి కొడుకు మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడని దాంతో తాను కూడా కథ నచ్చడంతో 50 వేల రూపాయలు అడ్వాన్సు కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చింది.
అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో తన పాత్రలో మార్పులు చేర్పులు చేయడంతో తాను ఈ చిత్రంలో నటించనని చెప్పానని దాంతో దర్శకుడు మరియు అతడి కొడుకు తనపై అత్యాచారయత్నం చేశారని ఈ విషయం గురించి బెంగళూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
అంతే కాకుండా ఈ చిత్రంలో నటించమని తనని సంప్రదించినప్పుడు తనతో పాటు ఈ చిత్రంలో ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు సీనియర్ నటుడు నాజర్ తదితరులు కూడా నటిస్తున్నట్లు చెప్పారని కానీ ఈ సినిమా షూటింగు ప్రారంభం అయిన తరువాత వీళ్లెవరూ కనిపించలేదని దాంతో తనకు అనుమానం వచ్చి దర్శకుడుని నిలదీయడంతో పెద్ద వాగ్వాదం జరిగిందని కూడా తెలిపింది.
దాంతో నిందితులు తనని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఈ క్రమంలో తమకి మాఫియా తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేసు వెనక్కి తీసుకోకపోతే హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు నటి నేహా సక్సీనా తెలిపింది.దీంతో ఈ విషయం శాండిల్వుడ్ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.