ఎప్పుడూ ఎవరో ఒకరు .ఏదో ఒక అంశం పై అసమ్మతి గురవుతూనే, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ లో సర్వసాధారణమైన అంశం.
ఈ తరహాలోనే ఎప్పుడూ ఎవరో ఒకరు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ సొంత పార్టీలోనే అసమ్మతి నాయకులుగా ముద్ర వేయించుకుంటూ ఉంటారు.తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద సంచలనం సృష్టించడంతో, చివరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.ఈరోజు జగ్గారెడ్డి తన వ్యాఖ్యలు చింతిస్తున్నాను అంటూ మీడియా ముందు క్షమాపణలు చెప్పారు.
ఇకపై పార్టీలో అంతా సమిష్టిగా పని చేస్తామని చెప్పి వివాదానికి ముగింపు పలికారు.ఇక్కడితో తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి వ్యవహారాలు సద్దుమణిగాయి అని అంతా ఊపిరి తీసుకుంటున్న సమయంలో, తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమ్మతిని వెళ్లగక్కారు.
అసలు కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాను అనే విషయాన్ని మీడియా ముందు చెప్పారు.తనకు రాజకీయాలు తెలియవని సంచలన వ్యాఖ్యలు చేశారు.మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే పార్టీని ఈ విధంగానా ముందుకు నడిపేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకే తాను పొలిటికల్ అఫైర్స్ మీటింగుకు వెళ్లలేదని, సీనియర్ నాయకులను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను ఏ విధంగా నియమిస్తారని వెంకటరెడ్డి ప్రశ్నించారు.
తాను ఈ వ్యవహారాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో చర్చించబోతున్నట్లు వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.హుజురాబాద్ స్థానం ఖాళీ అయ్యి నాలుగున్నర నెలలు అయింది అని, కొత్త పిసిసి వచ్చి మూడు నెలలు అయినా, ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రివ్యూ చేయలేదంటూ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
అసలు బీసీ నేతలు హుజురాబాద్ ఎందుకు వెళ్లడం లేదు అంటూ నిలదీశారు.అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, హుజురాబాద్ లో మూడు ఎన్నికల్లో 56 వేల ఓట్లు వచ్చాయని, అందరు కలిసి పని చేస్తే 50 వేల ఓట్లు రావా అంటూ పరోక్షంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.ప్రస్తుతం వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.