భారత్ లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
వ్యాక్సిన్ వస్తే మాత్రమే ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ప్రజలు, నిపుణులు చెబుతున్నారు.కరోనా మహమ్మారి త్వరగా అంతమైతే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.
వైరస్ పూర్తిగా అంతమైతే మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడుతున్నారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 సంవత్సరం చివరి వరకు కరోనా మహమ్మారి ఉంటుందని భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.కరోనా మహమ్మారి ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా పడుతోందని… పేద దేశాల్లో లక్షల మంది ప్రజలు వైరస్ అంతమయ్యేలోగా చనిపోతారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
వైరస్ కంటే వైరస్ సోకితే మనుషుల్లో ఏర్పడుతున్న ఒత్తిడి ప్రాణాలు పోవడానికి కారణం అవుతోందని అన్నారు.గేట్స్ ఫౌండేషన్ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంస్థలకు మిలియన్ డాలర్ల సహాయం అందిస్తోందని తెలిపారు.అగ్రరాజ్యంలో వైరస్ విషయంలో జరిగిన రాజకీయాల వల్లే వైరస్ నియంత్రణ ఆలస్యమైందని పేర్కొన్నారు.2021 చివరినాటికి భారీ స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ వస్తేనే ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను ఆదుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు.2021 చివరినాటికి కరోనా వైరస్ అంతమవుతుందని భవిష్యవాణి చెప్పారు.