ఒక్కోసారి రాజకీయంగా చేసే చిన్న చిన్న తప్పిదాలు పెద్ద నష్టాన్నే చేకూరుస్తాయి.అధికార పార్టీ అమలు చేసే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేద్దాం అంటే అది ఒక్కోసారి రివర్స్ లో తమకే చేటు తెస్తూ ఉంటుంది అందుకే ఏదైనా చేసే ముందు కాస్త వెనకా ముందు ఆలోచించుకోవాలి.
ఇప్పుడు ఇలాంటి వ్యూహాత్మక తప్పిదమే చేసి తెలుగుదేశం పార్టీ తీరిగ్గా బాధపడుతోంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
వైసీపీ ప్రభుత్వం ఏపీలో తెలుగు భాషను చంపేయాలని చూస్తోందని, అసలు భాషపై ఆ పార్టీకి ప్రేమే లేదు అంటూ భారీ భారీ డైలాగులు చెప్పి మరి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగారు.అయితే ఈ విషయం లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం ముందు గ్రహించలేకపోయారు.
ఇక వైసీపీ కూడా తమపై విమర్శలు చేస్తున్నవారిని ఉద్దేశించి మీ పిల్లలు ఎక్కడ చదుతువుతున్నారు వారు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదివితే సరిపోతుందా ? పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదవ వద్దా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.దీంతో ఈ విషయం పై జనాల్లో కూడా ఒకరకమైన చర్చ నడుస్తోంది.అయితే ఈ విషయంలో ఇప్పుడు తీరిగ్గా టీడీపీ బాధపడుతోంది.ఇప్పటికే అపార నష్టం జరిగిపోయిందని ఆలస్యంగా గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.వెంటనే యూ టర్న్ తీసుకున్నారు.తమ హయాంలోనే మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని, తాము ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు అంటూ వ్యాఖ్యానించారు.
పార్టీ నేతలకూ ఇదే విషయమై శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేశారు.ఇంగ్లీష్ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల్లో కూడా వ్యతిరేకత బాగా వచ్చిందని, దీన్ని మనం గుర్తించలేకపోయామని చంద్రబాబు తన బాధను వ్యక్తం చేసుకున్నారు.పేదలు, వెనుక బడిన వర్గాల వారు ఇంగ్లీష్లో చదువుకోకుండా టీడీపీ అడ్డుకుంటోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.వారు కూడా మీడియా మాయలో పడి అనవసరంగా ఇంగ్లీష్ మీడియంకు టీడీపీ వ్యతిరేకం అన్న భావన కలిగించామని నాయకులు నేతలు అభిప్రాయపడ్డారు.