హుజురాబాద్ ఉప ఎన్నిక తోపాటు, బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే .బద్వేల్ లో వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మికంగా మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
రాయలసీమ ప్రాంతం లోనూ అందున జగన్ సొంత జిల్లా కడప నియోజకవర్గంలో బద్వేల్ ఉండడం తో ఈ ఎన్నికల్లో గెలుపు పై వైసీపీ మొదటి నుంచి ధీమాగా ఉంది.తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా ఆదరణ లేకపోవడం, బిజెపి, జనసేన పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ఇవన్నీ లెక్క వేసుకుంటున్న వైసీపీ గెలుపు పై ధీమాగా ఉంది.
తాజాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు , జగన్ కు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ప్రతి ఎన్నికల్లోనూ వైసిపికి జనాల అభిమానం పెరుగుతోందని, ప్రజల ఆదరాభిమానాలతో తమ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను అంటూ రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వైసిపి బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరి సుధ పోటీ చేస్తారని ప్రకటించారు.ఈమె డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య .చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టిక్కెట్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న క్రమంలో ఆమెను అభ్యర్థిగా వైసిపి ఎంపిక చేసింది.
ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంగా జనాల్లో ప్రభుత్వ పాలన పై ఏ విధమైన అభిప్రాయం ఉంది అనేది తెలుసుకునేందుకు బద్వేల్ ఉప ఎన్నిక దోహదపడుతుందని వైసీపీ అభిప్రాయపడుతోంది.2019 ఎన్నికల్లో తో పోలిస్తే ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం లో మెజారిటీ మరింతగా పెరుగుతుంది అని ఆ పార్టీ అంచనా వేస్తోంది.ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యే లకు ఈ నియోజకవర్గ గెలుపు బాధ్యతలను వైసీపీ అప్పగించింది.