ఏపీ అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది.మూడు నెలల పరిపాలన కాలంలో తమపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నాయి.దానికి వైసీపీ కూడా ప్రతివిమర్శలు చేస్తోంది.
కానీ బీజేపీ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.బీజేపీ ఎంత దూకుడుగా విమర్శలు చేస్తున్నా వైసీపీ మాత్రం తిప్పికొట్టలేకపోతోంది.
ఇదే వైకిరితో వైసీపీ ముందుకు వెళ్తే రాజకీయంగా ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.ఇలా ఆరోపణల మీద స్పందన ఆలస్యమయ్యే కొద్దీ ప్రజల్లో అనేక ఊహాగానాలకు ఆస్కారం కల్పించినట్టే అవుతోంది.
అయితే ఈ విషయాలేవీ వైసీపీ నాయకులకు గాని ఆ పార్టీ అధినేత జగన్ కు కానీ తెలియనిది కాదు.అయితే బీజేపీ విషయంలో మాత్రం అలా ఉండలేకపోతోంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా రాజకీయ విమర్శలు చేసేవారు.దీని కోసం ఆ పార్టీ నాయకులు పోటీ పడుతూ స్టేట్మెంట్స్ ఇచ్చేవారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆ స్పీడ్ కనిపించడంలేదు.టీడీపీ, జనసేన మీద మాత్రమే చేయగలుగుతోంది తప్ప బీజేపీ విషయంలో ఆ విధంగా ముందుకు వెళ్లలేకపోతోంది.
ఇదే అదునుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణతో పాటు మిగతా బీజేపీ నాయకులంతా వైసీపీ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా వివాదాస్పద విమర్శలు చేశారు.
అసలు బీజేపీ సహకారం లేకపోతే కనీసం 40 సీట్లను కూడా వైసీపీ గెలిచేది కాదు అంటూ సంచలనం సృష్టించారు.ఇదే మాట ఇంకేదయినా పార్టీ వారు చేసి ఉంటే వైసీపీ రియాక్షన్ వేరేగా ఉండేది.
కానీ అలా మాట్లాడింది బీజేపీ నాయకుడు కాబట్టి వైసీపీ నేతలు ఎవరూ నోరు మెదపకుండా ఉన్నారు.
తమ ప్రత్యర్థులు చిన్న మాట అన్నా ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ట్విట్టర్ వేదికగా స్పందించే విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంపైన స్పందించలేదు.
సోషల్ మీడియా నుంచి జగన్ అనుకూల మీడియా వరకు ఎవరూ దీనిపై స్పందించలేదు.ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే జగన్ బీజేపీకి భయపడుతున్నాడా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.
బీజేపీతో పెట్టుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా జగన్ ని సైలెంట్ గా ఉండేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది.రాజకీయంగా ఇప్పుడు బీజేపీ చాలా బలంగా ఉంది.
వారి అనుకూల పవనాలు దేశమంతా వీస్తున్నాయి.వారిని ఇప్పుడు ఎదిరించి నిలవడం అంత తేలికైన విషయం కాదు.
అదీ కాకుండా ఏపీ ప్రభుత్వం తాము అమలు చేసే సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్రం అందించే నిధుల కోసం ఎదురుచూపులు చూస్తోంది.ఈ దశలో బీజేపీ తో వైరం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తున్న ఆలోచనతో సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.