ఉగ్రవాదులతో పోరు అంటే మాటలు కాదు.వారిని ఎదుర్కొనేందుకు ఏ పోలీస్ అధికారికైనా అత్యంత ధైర్య సాహసాలు ఉండాలి.
ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకు దూసుకెళ్లగలిగే ఆత్మ విశ్వాసం ఉండాలి.ఉగ్రవాదుల నుంచి దూసుకువచ్చే బుల్లెట్లను తప్పించుకుంటూ అత్యంత చాకచక్యంగా వారిని మట్టుబెట్టగలిగే పోరాట పటిమ ఉండాలి.అదిగో… ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు మేం చెప్పబోయే ఆ మహిళా పోలీస్ ఆఫీసర్లో నిండుగా ఉన్నాయి.అలా ఉన్నాయి కాబట్టే, ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నా ధైర్యంగా వారిని ఎదుర్కొంటోంది.ఈ క్రమంలోనే ఆమె ఇప్పటి వరకు 16 మందిని హతమార్చింది.ఆమే… అస్సాంకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సంయుక్త పరాశర్.
సంయుక్త పరాశర్ ఢిల్లీ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించింది.అనంతరం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ అందుకుంది.ఆ తరువాత యూఎస్ ఫారిన్ పాలసీ అనే అంశంపై పీహెచ్డీ, ఎంఫిల్ విద్యలను కూడా అభ్యసించింది.అనంతరం సివిల్స్ రాసి ఐపీఎస్ గా సెలెక్ట్ అయింది.2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్ ఈమె.అయితే 2008లో మకుం అనే ప్రాంతంలో అసిస్టెంట్ కమాండెంట్గా సేవలు అందించింది.అప్పుడు బంగ్లాదేశ్ మిలిటెంట్లకు, బోడోలకు మధ్య తీవ్రమైన గొడవల జరుగుతున్న రోజులు.వాటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసి సంయుక్త పరాశర్ పేరు తెచ్చుకుంది.
అనంతరం అస్సాంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టింది.ఈ క్రమంలోనే ఆమె కేవలం 15 నెలల పదవీ కాలంలోనే 16 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టింది.
అంతేకాదు, అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నందుకు గాను ఇప్పటి వరకు ఆమె మరో 64 మందిని అరెస్ట్ కూడా చేసింది.దీంతో ఒక్కసారిగా ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి.ఢిల్లీ కమిషన్ ఫర్ వుమన్ అవార్డును పొందిన 30 మంది మహిళల్లో ఈమె కూడా ఒకరు.
కాగా పరాశర్ అస్సాంకు చెందిన మరో ఐపీఎస్ ఆఫీసర్నే వివాహం చేసుకోగా, ఇప్పుడు వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.పరాశర్ తల్లి ఆమె కొడుకును పెంచుతోంది.అయితే పరాశర్కు రోజూ ఏదో ఒక రూపంలో చంపేస్తామని బెదిరింపులు వస్తూనే ఉంటాయట.అయినా… ఆమె వాటిని లెక్క చేయడం లేదు.ముందుకే సాగుతానంటోంది.! నిజంగా ఆమె ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!