175కు 175 స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో ఎన్నికలకు వెళ్ళిన జగన్ కు కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలోనే పార్టీ అభ్యర్థులు గెలవడం ఇప్పటికీ మింగుడు పడడం లేదు .ఓటమి భారం నుంచి ఇంకా పూర్తిగా జగన్ కోలుకోలేదు .
ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న జగన్( jagan ) పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు.అసలు పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం హయాంలో అమలు చేసినా ఎందుకు ఈ స్థాయిలో ఓటమి ఎదురయింది అనేది జగన్ కు అర్థం కావడం లేదు.
వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అభ్యర్థులు గెలుపొందడం అంతుపట్టడం లేదు.ఏపీలో ఎక్కడైతే ఎక్కువ సంక్షేమ పథకాలు అందాయో అభివృద్ధి జరిగిందో, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి తక్కువ ఓట్లు నమోదు అయినట్లుగా అందిన నివేదికలు జగన్ కు షాక్ కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీకి పెద్దగా ఓట్లు పడవని ముందుగానే జగన్ అంచనా వేశారు . రూరల్ ప్రాంతాల్లో తమకు తిరుగు ఉండదని, సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని జగన్ అంచనా వేసుకున్నారు.కానీ ఆ అంచనాలు తారుమారు అయ్యాయి.ఇంత ఘోర ఓటమికి గల కారణాలు ఏమిటనే దానిపైనే జగన్ విశ్లేషించుకుంటున్నారు.అయితే ఓటమికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి .వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు, కార్యకర్తలకు మధ్య ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచివేశారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి .వాలంటీర్ వ్యవస్థను( Volunteer system ) తీసుకురావడంతో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో ప్రజలకు అవసరం ఏర్పడలేదని, స్థానిక నేతలపై ఆధారపడుతున్న వాలంటీర్లకి తమ సమస్యలను చెప్పుకోవడం, వారి ద్వారానే పరిష్కారం లభించడంతో , పూర్తిగా నాయకులను జనాలు పక్కన పెట్టేసారని ,అలాగే కాంట్రాక్టర్లు , గ్రామాలను శాసించే నాయకులు కూడా తమకు వైసిపి ( YCP )వల్ల ఉపయోగం లేదని , తాము ఎందుకు సొంత సొమ్ములు ఖర్చు పెట్టుకుని పనిచేయాలనే ధోరణికి రావడం, కొంతమంది ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన వారు మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేసినా అది పెద్దగా కలిసి రాకపోవడం, అలాగే బీసీలు , ఎస్సీలు, ఎస్టీలు అంటూ జగన్ పదేపదే నినాదాలు వినిపించడంతో మిగతా కులాల వారిని వైసిపికి దూరం చేశాయనే నివేదికలు జగన్ కు అందాయి.
ముఖ్యంగా పార్టీ కేడర్ ను పట్టించుకోకపోవడం , గ్రామ స్థాయి నుంచి, రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోవడం, పార్టీ కోసం తాము చొక్కాలు చింపుకుని పనిచేసినా ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి చాలామంది వైసిపి నాయకులు రావడం, 2019 ఎన్నికల్లో పనిచేసినంత ఉత్సాహం మొన్న జరిగిన ఎన్నికల్లో లేకపోవడం, ఇవన్నీ వైసిపి ఓటమికి కారణాలు అయ్యాయి. 2029 ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పార్టీ నాయకులకు , కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం ఇస్తూ, మండల జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ , కార్యకర్తల కు అన్ని విధాల భరోసా ఇవ్వగలిగితేనే మళ్లీ ఏపీలో వైసిపి పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది
.