అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకి తన కొలువులో కీలక బాధ్యతలు కల్పిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒరవడిని ఇంకా కొనసాగిస్తున్నారు.రానున్న కాలంలో మరింత మంది ఇండో అమెరికన్లకు ఉన్నత హోదా దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.
సొంత పార్టీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా భారతీయుల సత్తాపై నమ్మకంతో బైడెన్ ఇండో అమెరికన్లను ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారు.తాజాగా ఈసారి ఏకంగా నలుగురు భారత సంతతి ప్రముఖులకు చోటు కల్పించారు అమెరికా అధ్యక్షుడు.
ఆసియన్ అమెరికన్లు, నేటివ్ హవాయియన్లు, పసిఫిక్ ద్వీపవాసులకు (ఏఏఎన్హెచ్పీఐ) సంబంధించిన అడ్వైజరీ కమిషన్లో నలుగురు భారతీయ అమెరికన్లను నియమించాలనుకుంటున్నట్లు జో బైడెన్ సోమవారం ప్రకటించారు.వీరిలో అజయ్ జైన్ భుటోరియా, సోనాల్ షా, కమల్ కాల్సీ, స్మితా ఎన్ షాలు ఉన్నారు.
ఆసియా అమెరికన్, నేటివ్ హవాయియన్లు, పసిఫిక్ ద్వీపవాసుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసే అంశాలపై ఈ కమిషన్ అమెరికా అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ప్రధానంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆసియన్లు ఎదుర్కొంటున్న విద్వేషం, హింసను కట్టడి చేయడంపై సూచనలు ఇస్తుంది.
జో బైడెన్ జట్టులో స్థానం సంపాదించిన ఈ నలుగురు ప్రముఖులు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు.సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా అజయ్ భుటోరియా పనిచేస్తున్నారు.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్ షా విద్యావేత్తగా కృషి చేస్తున్నారు.న్యూజెర్సీకి చెందిన డాక్టర్ కమల్ సింగ్ కాల్సి డాక్టర్.
అమెరికా సైన్యంలో దాదాపు 20 ఏళ్ల పాటు సేవలు అందించారు.ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లపై పోరులో కమల్ సింగ్ అందించిన సేవలకు గాను అమెరికా ప్రభుత్వం కాంస్య నక్షత్ర పతకం ఇచ్చి గౌరవించింది.
ఇక ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్షా.చికాగోకు చెందిన స్పాన్ టెక్కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ – చికాగో సిస్టర్ సిటీస్ ఈవెంట్, చికాగో ప్లాన్ కమీషన్ తదితర కార్యక్రమాల్లో స్మితా పనిచేశారు.