పూర్తిగా టిఆర్ఎస్ పార్టీని , ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.అసలు షర్మిల పార్టీ పెట్టింది టిఆర్ఎస్ ను ఓడించేందుకే అని, బిజెపి ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగంగానే షర్మిలను రంగంలోకి దించారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే షర్మిల సైతం ఎక్కువగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడం, బిజెపి విషయంలో సైలెంట్ గా ఉండడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ప్రధాని నరేంద్ర మోది షర్మిల కు ఫోన్ చేసి పరామర్శించడం పై టిఆర్ఎస్ భగ్గు మంటోంది.
కొద్దిరోజులు క్రితం ప్రగతి భవన్ ముట్టడించేందుకు షర్మిల ప్రయత్నించడం, అంతకుముందే ఆమె కార్ల కాన్వాయ్ పై పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు జరగడం, వాహనం ధ్వంసం కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై పధాని నరేంద్ర మోది స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు.
ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది.తాజాగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ వ్యవహారం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలుగా కూడా గెలవదని, ఆమెకు దేశ ప్రధాని నరేంద్ర మోది ఫోన్ చేసి పరామర్శించడం ఏమిటని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.ప్రధాని నరేంద్ర మోదీ వైయస్ షర్మిల కు ఫోన్ చేయడం సిగ్గుచేటని, తెలంగాణలో ఏ పార్టీ వారైనా తిరిగే స్వేచ్ఛ ఉందని , కాకపోతే స్థాయికి తగ్గట్టే మాట్లాడాలని సత్యవతి రాథోడ్ అన్నారు.
స్థాయి దాటి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, మానుకోట రాళ్లదెబ్బ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
ఇన్ని రోజులు షర్మిల ఆడిన నాటకానికి సూత్రధారి ప్రధాని నరేంద్ర మోదీ అని అందరికీ అర్థమైందని విమర్శించారు.తెలంగాణకు రావలసిన అనేక ప్రాజెక్టుల గురించి ఎన్నో సార్లు కేసీఆర్ తో పాటు, రాష్ట్ర మంత్రులు ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించినా కనికరించలేదని, కానీ షర్మిలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని మంత్రి మండిపడ్డారు.సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని ఈ విషయాన్ని షర్మిల గుర్తుపెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు.