కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణీకులు, విమాన రాకపోకలపై ఎన్నో దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అయితే పరిస్ధితులు కుదుటపడుతుండటంతో ఒక్కో దేశం ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.
మొన్న యూఏఈ ఈ రకమైన ఆంక్షలను ఎత్తివేయగా.తాజాగా ఈ లిస్ట్లో బ్రిటన్ కూడా చేరింది.
ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున రెడ్లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్లో చేర్చింది.ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో యూకే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ఇదే అదనుగా పలు ఎయిర్లైన్స్లు టికెట్ల ధరలను భారీగా పెంచేస్తున్నాయి.ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో ఇండియా- యూకే విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి.వన్ వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు అక్షరాల రూ.4 లక్షలకు చేరుకున్నాయి.దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ గుప్తా ట్విట్టర్ ద్వారా కేంద్ర పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు.ఆగస్టు 26న ఢిల్లీ నుంచి లండన్కు విమాన టికెట్ ధర రూ.3.95 లక్షలన్న ఆయన.ఇది ఫస్ట్ క్లాస్ కాదని, బ్రిటీష్ ఎయిర్వేస్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర అని చెప్పారు.ఇదే సమయంలో ఎయిరిండియా, విస్తారాలు కూడా ఎకానమి క్లాస్కు రూ.1.2 నుంచి 2.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయని గుప్తా ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.విమానాలు పరిమితంగా వుండటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని నిర్ధారణకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ సర్వీసులు పెంచాలని నిర్ణయించింది.ప్రస్తుతం భారత్- బ్రిటన్ల మధ్య ప్రస్తుతం వారానికి 30 విమానాలనే అనుమతిస్తుండగా.ఆ సంఖ్యను తాజాగా 60కి పెంచింది.కొత్త పరిమితి ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.దీనిప్రకారం రెండు దేశాల మధ్య భారతీయ విమానయాన సంస్థలు 30 విమానాలను, బ్రిటన్ సంస్థలు మరో 30 విమానాలను ప్రతి వారం నడపనున్నాయి.
భారతదేశ కోటాలో ఉన్న 30లో.ఎయిరిండియాకు 26, విస్తారాకు 4 కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.