నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.వీరిని శాంతింపజేసేందుకు కేంద్రం పలు విడతలుగా చర్చలు జరిపింది.
అయితే ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి.కేంద్రం మెట్టు దిగకపోవడం, రైతులు సవరణలకు ససేమిరా అంటుండటంతో సమస్య రోజురోజుకి జఠిలమవుతోంది.
మరోవైపు రైతుల ఆందోళనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు లభిస్తోంది.కెనడా ప్రధాని, బ్రిటన్ చట్టసభ సభ్యులు, ఇండో అమెరికన్ సెనేటర్లు రైతులకు అండగా ఉంటామని తెలిపారు.
తాజాగా రైతు ఉద్యమంపై భారత ప్రభుత్వంతో చర్చించాలని ఏడుగురు అమెరికా చట్టసభ సభ్యులు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు లేఖ రాశారు.లేఖ రాసిన వారిలో ప్రవాస భారతీయురాలు ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు.
ఇది భారతదేశ అంతర్గత విషయమే అయినప్పటికీ, భారత్తో సంబంధాలు ఉన్న అందరికీ ఆందోళన కలిగించే అంశమని వారు లేఖలో పేర్కొన్నారు.భారతీయ అమెరికన్లపై కూడా రైతు ఉద్యమం ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరీ ముఖ్యంగా పంజాబ్తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత చట్టాలను తాము గౌరవిస్తామని, అయితే రైతుల ఆర్థిక భద్రతపై కూడా తమకు అనుమానం ఉందన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించేలా చూడాలని పాంపియోను కోరారు.
![Telugu Lawmakerslend, Delhi, Narendra Modi, Pramila Jayapal, Vivek Agarwal, Writ Telugu Lawmakerslend, Delhi, Narendra Modi, Pramila Jayapal, Vivek Agarwal, Writ](https://telugustop.com/wp-content/uploads/2020/12/US-Lawmakers-Lend-Support-To-Protesting-Farmers-Write-To-Pompeo-Narendra-Modi.jpg)
మరోవైపు రైతుల ఆందోళనపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది.ఇది పూర్తిగా తమ దేశ అంతర్గత విషయమని.ఇందులో మరో దేశం జోక్యం చేసుకోరాదంటూ గతంలోనే స్పష్టం చేసింది.
కాగా, వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది.కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ మేరకు రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు.