జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఆవేశంగా ప్రసంగించారు.వైసీపీ ప్రభుత్వం పై తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
వైసిపి మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు తాను ఏమి చేసేందుకైనా సిద్ధం అన్నట్టుగా స్టేట్మెంట్ లు ఇస్తున్నారు.పొత్తులు పెట్టుకునే 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము అనే విషయాన్ని పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ముఖ్యంగా టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని పరోక్ష వ్యాఖ్యలు చేయడం తో పవన్ పై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.పవన్ పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యింది.
అయినా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని, ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలవడం, వేరే వారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రయత్నాలు చేయడం వంటి వ్యవహారాలు చేస్తున్నారని, ఇలా అయితే రాజకీయంగా పవన్ పై జనాలలోనూ, అభిమానుల్లోనూ ఉన్న నమ్మకం పోతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జనసేన ను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విషయంలో పవన్ పదే పదే తప్పులు చేస్తున్నారు.పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విషయంలో అంత సీరియస్ గా దృష్టి పెట్టడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.అప్పుడప్పుడు రాజకీయాలు అన్నట్లుగా పవన్ వ్యవహారం ఉండడం, పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తయినా, ఇంకా పూర్తిస్థాయిలో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లలేక పోవడం, చేరికలు అంతంత మాత్రంగా ఉండడం ఇవన్నీ ఇబ్బందికర అంశాలే.
ఇక ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న వైఖరి కూడా అనేక విమర్శలకు కారణం అవుతోంది.ఏపీ ప్రయోజనాలను తీర్చడంలో బిజెపి సానుకూలంగా స్పందించక పోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా, ఆ పార్టీతోనే ఎన్నికలకు వెళ్లేందుకు పవన్ సిద్ధమవడం, అదే స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ పవన్ విమర్శలు చేస్తున్న తీరు ప్రజలకు గందరగోళంగా కనిపిస్తోంది. ఏ విషయంలోనూ పవన్ తన వైఖరిని బయట పెట్టడం లేదని , అమరావతి విషయంలో గతంలో పవన్ వ్యతిరేకించడంతో పాటు, కర్నూల్ వెళ్లిన సందర్భంలో కర్నూలు రాజధాని అని మాట్లాడడం, అలాగే విశాఖ వెళ్ళినప్పుడు విశాఖ రాజధానిగా ఉండాలని మాట్లాడడం , ఇప్పుడు మళ్ళి అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా గతంలో తిట్టిపోసిన టిడిపితోనే ఇప్పుడు జతకట్టేందుకు ప్రయత్నిస్తుండడాన్ని జన సైనికులే తప్పుపడుతున్నారు.
అయితే నాయకుడి పై ఉన్న అభిమానంతో మౌనంగానే పవన్ నిర్ణయాన్ని సమర్థించాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది.