ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే.దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఏయూ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో లక్షలాదిమంది జనాలలో సభా వేదికపై మోడీతోపాటు సీఎం జగన్ ఇంకా గవర్నర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పాల్గొన్నారు.సభలో భాగంగా సీఎం జగన్ తెలుగులో ప్రసంగించారు.
తన ప్రసంగంలో విభజన హామీలతో పాటు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయం పట్ల అనేక విషయాలు తెలియజేశారు.
అయితే ప్రధాని సభలో సీఎం జగన్ మాట్లాడిన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.“ముఖ్యమంత్రి గారు మీ తెలివి అమోఘం.ప్రధానమంత్రికి అర్థం కాకుండా రాష్ట్ర సమస్యలను తెలుగులో ప్రస్తావించారు.
ఆయనను యధా విధంగా ప్రసన్నం చేసుకున్నారు.రాష్ట్ర ప్రజలకు మాత్రం సమస్యలన్నీ ఏకరువుపెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తూతూ మంత్రంగా ఉభయతారకంగా మాట్లాడిన మీ శల్య సారథ్యం రాష్ట్రానికో వరం” అంటూ వర్ల రామయ్య వ్యంగ్యంగా విమర్శించారు.