రెండోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.టిడిపి , జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కలిసి వచ్చినా తమ విజయానికి డోకా లేదనే నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసే విధంగా అనేక ప్రచార కార్యక్రమాలకు శ్రీకరం చుట్టారు.దీనిలో భాగంగానే ‘ మేమంతా సిద్ధం ‘ పేరుతో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా , మిగతా అన్ని జిల్లాల్లోనూ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను 21 రోజులపాటు నిర్వహించనున్నారు.ఈనెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఈ ప్రచార కార్యక్రమం మొదలుకానుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఎన్నికల సంగ్రామానికి ‘ మేమంతా సిద్ధం ‘ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులు పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది.కొద్దిరోజుల క్రితం పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు నిర్వహించిన సిద్ధం సభలు జరిగిన నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ బస్సు యాత్ర జరగనుంది.ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగునుంది.
ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు , వివిధ రంగాల ప్రజలతో జగన్ సమావేశం అవుతారు.
ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరచుకోవడానికి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు.ఈ సందర్భంగా కొంతమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులను జగన్ కలుస్తారు.సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు , కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.పూర్తిగా జనాలతో జగన్ మమేకమయ్యే విధంగా యాత్ర కొనసాగుతుంది.
గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలను 99% అమలు చేశామని చెబుతూ ,ప్రతి ఇంటికి ఏ మేరకు మేలు చేశామనేదాన్ని వివరించనున్నారు.ఈ యాత్ర ద్వారా జనాల్లో వైసిపి క్రేజ్ పెంచడంతో పాటు కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేశారు.