భారత్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్తో మొదలైన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
అయితే మనదేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి.అమెరికా, బ్రిటన్, యూఏఈలు నిషేధాన్ని ఎత్తివేసిన జాబితాలో వున్నాయి.
దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే అమెరికా, బ్రిటన్ తర్వాత భారతీయులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే కెనడా మాత్రం విమానాలపై బ్యాన్ ఇంకా కొనసాగిస్తూనే వుంది.
తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఎదురుచూస్తున్న వారికి కెనడా ప్రభుత్వం షాకిచ్చింది.భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది.
అయితే ఆంక్షలు విధించినప్పటికీ కెనడా.భారతీయులకు చిన్న వెసులుబాటు కల్పించింది.
అదేంటంటే.‘థర్డ్ కంట్రీ’ ద్వారా భారత్ నుంచి ప్రయాణికులు కెనడా రావొచ్చని తెలిపింది.
ఇందుకోసం ప్రయాణికులు మరో దేశంలో దిగి అక్కడ కరోనా టెస్టులు చేయించుకోవాలి.అనంతరం అక్కడే రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉండాలి.
ఆ తర్వాత కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్తో కెనడాకు రావొచ్చని వెల్లడించింది.ఈ థర్డ్ కంట్రీ విధానం ద్వారా కెనడా వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధిని పడరాని పాట్లు పడింది.
వివరాల్లోకి వెళితే.భారత్కు చెందిన లెరీనా కుమార్ అనే విద్యార్థిని కెనడాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్నారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా విధించిన ఆంక్షలతో ఆమె భారత్లోనే వుండిపోయారు.అయితే కెనడా ప్రభుత్వం సెప్టెంబర్ 21 వరకు నేరుగా వచ్చే విమానాలపై ఆంక్షలను పొడగిస్తూనే అత్యవసరంగా రావాలనుకునేవారికి ‘‘థర్డ్ కంట్రీ’’ ఆప్షన్ ఇచ్చింది.
దీనిపై హర్షం వ్యక్తం చేసిన లెరీనా కుమార్ తొలుత ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లింది.అక్కడ బార్సిలోనా విమానం కోసం 9 గంటలు వేచి చూసింది.ఆ తర్వాత మెక్సికో విమానం కోసం మరో 2 గంటలు వేచి చూడాల్సి వచ్చింది.అనంతరం మెక్సికోలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకుని దాని ఫలితం కోసం రెండు రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాంకోవర్కు, అక్కడి నుంచి కెనడాకు చేరుకుంది.నేరుగా అయితే 22 గంటల్లో ముగియాల్సిన కెనడా ప్రయాణానికి ఇప్పుడు దాదాపు వారం రోజులు పట్టింది.
రూ.లక్షన్నరలోపే అవ్వాల్సిన ఖర్చు రూ.5 లక్షలను దాటింది.ఈ స్థాయిలో ఖర్చు పెట్టగల స్తోమత అందరికీ వుండదు.
కెనడాలో చదువుకునే వారిలో పేద కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు.ఇలాంటి వారు థర్డ్ కంట్రీ విధానానికి లక్షలు ఖర్చు పెట్టలేక.
నేరుగా విమానాలు ప్రారంభమయ్యే వరకు ఎదురుచూస్తున్నారు.