తెలుగుతేజం సత్య నాదెళ్ల తన ప్రస్థానంలో మరో ఘనత సాధించారు.టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన.
తాజాగా ఆ సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఏకగ్రీవంగా సత్య నాదెళ్ల పేరుకు ఆమోదం తెలిపారు.
దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది.ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న జాన్ డబ్ల్యూ థామ్సన్ను స్వతంత్ర డైరెక్టర్గా నియమించింది.
ఇంతకుముందు కూడా థామ్సన్ 2012 నుంచి 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు.మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో థామ్సన్ బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలా ఉండగా మైక్రోసాఫ్ట్ నుంచి గేట్స్ పూర్తిగా తప్పుకుని ఏడాది పూర్తయ్యింది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యవర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
బోర్డు ఛైర్మన్గా సత్య నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు సత్యనాదెళ్లకు వ్యాపారంపై ఉన్న అనుభవం, అవగాహన బాగా ఉపయోగపడుతుంది అని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 నుంచి సత్య నాదేళ్ల కొనసాగుతున్నారు.
తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన ‘బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‘ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే తాను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గేట్స్ అప్పట్లో ప్రకటించారు.అయితే, అది నిజం కాదని ఇటీవల పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్ గేట్స్ లైంగిక సంబంధాలు కొనసాగించారని.
దీనిపై బోర్డు మూడో సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెల్లడించాయి.ఈ కారణం చేతనే ఆయన బోర్డు నుంచి వైదొలిగినట్లు మైక్రోసాఫ్ట్ అధికారిక వర్గాలే వెల్లడించినట్లు ఆ కథనాల సారాంశం.
కాగా, 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన సత్య నాదెళ్ల.అంతకుముందు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తించారు.మైక్రోసాఫ్ట్ స్థాపన నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి సత్య నాదెళ్ల.
సత్యనాదెళ్ల ప్రస్థానం: సత్య నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామం.ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి.2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.సత్య విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే సాగింది.
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు.సన్ మైక్రోసిస్టమ్లోని టెక్ బృందంలో పనిచేసిన సత్యనాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు.కీలక విభాగాలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్లయింట్ సర్వీసెస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విండోస్ సర్వీర్, డెవలపర్ టూల్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2014లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు.
క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు మొబైల్ రంగంపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు.న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ఇన్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో పాటు అనేక డీల్స్తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో సత్యనాదెళ్ల కీలక పాత్ర పోషించారు.