లోకంలో మనిషికి తెలియకుండా సంభవించే మరణం కలిగించే బాధ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.కానీ మరణించడం ఖాయం అని తెలిసి ఆ మరణం కోసం ఎదురుచూస్తూ బ్రతకడం మాత్రం నరకమే అవుతుంది.
అందులో నయం కానీ జబ్బులతో పడే వేదన మరి చిన్న పిల్లలకు కలిగితే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం బ్రహ్మతరం కూడా కాదు.
ఇకపోతే ఇలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో సంతోషం నింపడం కోసం గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కొంత సేపటి వరకు తన పోస్టును ఆ చిన్నారికి అప్పచెప్పాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.గుంటూరుకు చెందిన నోయల్ చాంద్, బీబీ నూర్జహాన్ దంపతుల కుమారుడు రిహాన్ క్యాన్సర్ బారినపడడంతో ఎలాగోలా అతడికి చికిత్స చేయిస్తున్నారు.ఈ క్రమంలో అతనికి పోలీసు అవ్వాలన్న కోరిక బలంగా ఉందన్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ గుంటూరు జిల్లా పోలీసులకు తెలిపిందట.
దాంతో క్యాన్సర్ బాధిత చిన్నారి రిహాన్ ను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఎస్పీ ఆ బాలుడిని తన కుర్చీలో కూర్చోబెట్టడమే కాకుండా, ఎస్పీగా బాధ్యతలు కూడా అప్పగించారట.
ఈమేరకు ఎస్పీ చాంబర్ లో కూర్చుని, ఆదేశాలు ఇస్తున్న ఈ చిన్నారి ముఖంలో ఆనందం నిజంగా వెలకట్టలేనిదని వారు పేర్కొంటున్నారు.కాగా బ్రతుకుతాడో లేదో తెలియని చిన్నారి కోరిక పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ అమ్మిరెడ్డిది నిజమైన మానవత్వం అంటూ అందరూ అభినందిస్తున్నారు.