ఏపీ రాజకీయాలలో రాజధాని రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.ఇన్ని రోజులు టీడీపీ పార్టీ రాజధాని ఇష్యూ మీద ఆందోళనలు చేస్తూ ఉంటే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకి వచ్చారు.
ఈ రోజు మంగళగిరిలో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాల నాయకుల అభిప్రాయాలని తీసుకున్న తర్వాత రాజధాని అంశం మీద స్పందించారు.రాజధాని విషయంపై వైసీపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిన తర్వాత కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.
అయితే రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.రైతులతో మాట్లాడేందుకు రేపు తుళ్ళూరు వెళ్లనున్నట్లు తెలిపారు.
అదే సమయంలో కర్నూల్ కి హైకోర్టు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి హైకోర్టుని తరలించడానికి ఎలాంటి అధికారాలు ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
అలాగే రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులని అకారణంగా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.రైతులని రెచ్చగొట్టింది మీరు, ఈ ఆందోళనకి కారణం అయ్యింది మీరు, కేసుల వరకు వెళ్ళే పరిస్థితిని క్రియేట్ చేసింది మీరు.
ఇప్పుడు రాజధాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా రైతులు ఆందోళనకి కారణమై ఇప్పుడు వారి మీద కేసులు పెడితే ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.ఇక మూడు రాజధానుల గురించి వైసీపీ నేతలకి ఎలాంటి క్లారిటీ లేదని అన్నారు.
భీమిలి రాజధానిని చేస్తామని ఎలాంటి అధికారాలతో అక్కడ చెబుతున్నారు.జిఎన్ రావు కమిటీ విజయనగరాన్ని రాజధానిగా చేయమని చెబితే వాళ్ళ సిఫార్సుని వైసీపీ అమలు చేయలేదు.
వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.రాజధాని మీద ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఎక్కడికైనా తరలించవచ్చని అన్నారు.
అలా కాకుండా ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించి రాజకీయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.మరి జనసేన అధినేత మాటలకి ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.