రాజస్థాన్లోని సవాయ్మాధోపూర్లోని రణ తంబోర్ పులుల అభయారణ్యం మధ్యలో… మూడు కళ్లు కల్గిన వినాయకుడి విగ్రహం ఉందంట. అయితే ఈ వినాడకుడిని ఏ కోరిక కోరుకున్నా తీరుతుందనేది అక్కడి భక్తుల నమ్మకం.
అయితే భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్… అందేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ త్రినేత్ర వినాయకుడికి తమ సమస్యలను తెలుపుతూ… ఆ కష్టాలను తీర్చమని వేడుకుంటూ భక్తులు ఉత్తరాలు రాస్తారట.
అలా చేస్తే… కచ్చితంగా ఆ సమస్యలు తీరిపోతాయట. జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణతంబోర్ కోటలో ఉందీ మహిమాన్విత క్షేత్రం.
ఆరావళి, వింధ్య పర్వతాలు కలిసేచోట 1580 అడుగుల ఎత్తులో కొలువు దీరింది.
అయితే ఈ మూడు కళ్ల వినాయకుడు స్వయం భువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
స్వామి వారు వెనక ఉన్న కొండ నుంచి ఉద్భవించారట. ఆయన ఇద్దరు భార్యలు బుద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ విగ్రహాలను కూడా ఈ ఆలయంలో నెలకొల్పారు.
వెయ్యేళ్ల చరిత్ర కల్గిన ఈ గణేషుడికి మూడు కళ్లు ఉండటమే కాక ఉత్తరాలు కూడా రాయడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే సంతానం, ఉద్యోగం, పదోన్నతి, వ్యాపారం, ఇంట్లో గొడవలు… ఇలా మరెన్నో చింతలు తీర్చమని త్రినేత్ర గణేశుడిని భక్తులు వేడుకుంటారు.
వారి మనస్సుల్లో కోరుకున్న అన్నింటినీ ఆ గణ నాథుడు పూర్తి చేస్తాడట. త్రినేత్ర గణేశ్ దర్శన భాగ్యంతోనే ప్రపంచంలోని అన్ని సమస్యలు దూరమై పోతాయని భక్తుల ప్రగాఢ విశ్యాసం.
మీకూ వెళ్లాలనిపిస్తోందా. అయితే రాజస్థాన్ వెళ్లాల్సిందే.