మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన వాయిస్ గా నిలుస్తూ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు నగరి ఎమ్యెల్యే రోజా.దానికి తగ్గట్టుగానే జగన్ కూడా ఆమెకు అదే స్థాయిలో గౌరవం ఇస్తూ వస్తున్నారు.
ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు జగన్ ప్రభుత్వం కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని అంతా అంచనా వేశారు.రోజా కూడా నగరి శాసనసభ స్థానం నుంచి రెండోసారి గెలవడంతో తప్పకుండా మంత్రి పదవి వచ్చి తీరుతుందని ఆశలు పెట్టుకున్నారు.
కానీ జగన్ మాత్రం ఆమెకు మొండిచేయి చూపించారు.సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి దక్కలేదు అనేది బహిరంగ రహస్యం.
అప్పట్లో దీనిపై రోజా అలకబూనడంతో ఆమెను బుజ్జగిస్తూ కొద్ది రోజులకే ఆమెకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమించి రోజాకు తాను ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో జగన్ చూపించారు.అయినా ఆమెలో మంత్రిని కాలేకపోయాను అనే బాధ ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది.
తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది.అయితే ఇంకా వారికి మంత్రి పదవుల్లో కొనసాగే అవకాశం ఉన్నా జగన్ మాత్రం వారితో ముందుగానే రాజీనామాలు చేయించాలని చూస్తున్నారు.
అదే కనుక నిజమైతే జగన్ క్యాబినెట్ లో రెండు పదవులు ఖాళీ అవుతాయి.వాటిల్లో ఒక పదవిని రోజాకు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.చివరి నిమిషంలో జగన్ జరిగితే తప్ప దాదాపు రోజా పేరు ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం మండలి సభ్యులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్,ఎం మోపిదేవి వెంకటరమణ లతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది అనే విషయపై పార్టీ లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం నైతికంగా సరికాదనే వాదనే ముఖ్యమైన కారణమట.దీంతో.త్వరలోనే ఈ ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.