ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు వ్యవహారంపై చర్చ సాగుతోంది.ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అయితే దీనిపై ప్రజల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్వార్థ రాజకీయాల కోసం హత్య కేసును వాడుకోవడంపై ఏపీ వాసులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మీ( YS Lakshmi ) రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.
ఏపీ పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల( YS Sharmila ) రానున్న ఎన్నికల్లో కడప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మృతుడు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డితో( Sunitha Reddy ) కలిసి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సీఎం జగన్ తో పాటు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిపై( Avinash Reddy ) హంతకుడు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దీనిపై స్పందించిన ఆయన తల్లి వైఎస్ లక్ష్మీ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి మొదటి భార్య సౌభాగ్యమ్మకు( Soubhagyamma ) లేఖ రాశారు.

వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన వారితో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ లక్ష్మీ మండిపడ్డారు.వివేకానంద రెడ్డి జగన్ ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట వాస్తవమని పేర్కొన్నారు.అదేవిధంగా మార్చి 14, 2019 లో అవినాశ్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేకా ప్రచారం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.అప్పుడు స్వయంగా మీ కుమార్తె సునీతనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిందన్నారు.
కానీ ఇవాళ దివంగత నేత వైఎస్ఆర్, సీఎం జగన్ శత్రువులతో చేతులు కలిపిన మీరు అదే ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య కేసు జరిగిందని ఆరోపించడం, తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం తప్పు అనిపించడం లేదా అని నిలదీశారు.
ఎవరి కోసం, ఎవరిని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే 2009 లో జగన్( Jagan ) తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని సౌభాగ్యమ్మను ప్రశ్నించారు.2010 లో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) జగన్ ను చిన్న చూపు చూసినప్పుడు జగన్ గా అండగా నిలిచి పెద్దదిక్కుగా ఉండవలసిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారన్నారు.జగన్ ను ఒంటరి వాడిగా చేసినప్పుడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
అంతేకాకుండా 2011 లో సునీత, ఆమె భర్తతో కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన గురించి ఒక్కసారి కూడా అర్థం కాలేదా అని దుయ్యబట్టారు.

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారన్న వైఎస్ లక్ష్మీ దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారో చెప్పాలన్నారు.మాటిమాటికి హంతకుడంటూ తీవ్రమైన పదజాలంతో అవినాశ్ రెడ్డిని కించపరచడం సరికాదన్నారు.ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా.
మీరే ఓ వ్యక్తిని హంతకుడిగా ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు.అలా అసత్య ఆరోపణలు చేయడం తప్పు అనిపించడం లేదా అన్న వైఎస్ లక్ష్మీ నీ కుమార్తె సునీతను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదని పేర్కొన్నారు.
వారు మాట్లాడుతున్న మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణమని తెలిపారు.
సునీత నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్ధతు ఇచ్చే వారు.
కానీ వైఎస్ఆర్, జగన్ శత్రువుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్ధతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా శత్రువుల చెంత నుంచి బయటకు రావాలని సూచించారు.
తప్పు తెలుసుకుని నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలని హితవు పలికారు.అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎంత బాధ, ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు.
నిజం ఎంత లోతులో దాచిన దాగదన్న వైఎస్ లక్ష్మీ ఏదో ఒకరోజు తప్పకుండా బయట పడుతుందని స్పష్టం చేశారు.ప్రస్తుతం వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మకు వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మీ రాసిన ఈ లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.