రాజకీయాలకు అర్థాలు, పరమార్థాలు, నియమాలు, నిబంధనలు ఎప్పుడో కనుమరుగైపోయాయి.నేటి రాజకీయం అంతా, ప్రత్యర్థుల రాజకీయాన్ని రాజకీయం చేయడమే అన్నట్టుగా మారిపోయాయి.
అధికార పార్టీ, విపక్షం, స్వపక్షం ఇలా వారు వీరు అనే తేడా లేదు.నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రజల్లో పార్టీలు పలుకుబడి పెంచుకునేందుకు, రాజకీయాలను రాజకీయం చేసే పనిలోనే నాయకులు నిమగ్నం అయిపోయారు.
ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం అధికార పార్టీ విధి.అయితే, అధికార పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తతో పనిచేస్తుందా లేదా ? ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ? అనేది చూసుకుంటూ, సమర్ధవంతంగా, అప్రమత్తతో వ్యవహరిస్తూ, ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ, ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలి.
కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.కేవలం అధికార పార్టీకి క్రెడిట్ దక్కకుండా చేసేందుకు, విపక్షాలు ప్రయతినిస్తుంటే, విపక్షాలు ప్రజల్లో బలం పెంచుకోకుండా చేస్తూ, అవి మరింతగా బలహీన పడే విధంగా చేస్తూ, అణగదొక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నించడం నిత్యకృత్యంగా మారిపోయింది.
ఈ విషయంలో ఒకరిది తప్పు, మరొకరిది ఒప్పు అని చెప్పేందుకు అవకాశం లేకుండా, ప్రస్తుత రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉండగా చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, వాటిపై విచారణ చేస్తూ, ఆ పార్టీలోని కీలక నాయకులను అరెస్టు చేయిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆ పార్టీలో ఉన్నవారు, తమ పార్టీలో చేరే విధంగా చేస్తూ అధికార పార్టీ తమ ప్రతాపం చూపిస్తుంటే, అధికార పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజలకు మేలు చేసే విధంగా పని చేస్తున్నా, చిన్న లోపాలను సైతం ఎత్తిచూపుతూ, అవినీతి ఆరోపణలు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటూ, కోర్టుల్లో కేసులు వేస్తూ, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.
ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకే సమయం కేటాయిస్తున్నారు తప్ప, అసలు తాము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము ? ఏం చేస్తున్నాము అనే విషయాలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు.రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవడం కోసం, పలుకుబడి పెంచుకోవడం కోసం అన్నట్టుగా నాయకుల వ్యవహార శైలి ఉంటోంది.ఈ విషయంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు.అన్ని పార్టీల వ్యవహారశైలి ఇదే రకంగా ఉంటోంది.
పైకి మాత్రం తాము ప్రజల కోసమే కష్టపడి పోతున్నాము అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.కేవలం కొద్దిమంది మాత్రమే చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు తప్ప, మెజారిటీ నాయకుల వ్యవహారశైలి మాత్రం విమర్శల పాలయ్యే విధంగానే ఉంటూ వస్తున్నాయి.
నేటి రాజకీయాల్లో ఇంతకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది.