కొంతమందికి రాజకీయాల్లో బాగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు.దీనికోసం కొన్ని కొన్ని సార్లు పార్టీ లో యాక్టివ్ గా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు.
అయితే కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీరాములు మాత్రం తనకు మంత్రి పదవి నుంచి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలి అంటూ ఏకంగా అమ్మవారికే చీటీ రాసి మరి అర్జీ పెట్టుకున్నారు.అయితే ఈ చీటీ బయటకు పొక్కడం తో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
యాదగిరి జిల్లా శహపురలో వెలసిన దుర్గాదేవి దర్శనానికి గురువారం వెళ్ళిన శ్రీరాములు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.దుర్గాదేవి చెంతకు ఓ చీటీ రాసి పూజలు జరిపించారు.
అందులో శ్రీరాములు, డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటకగా నమోదు చేశారు.వాస్తవానికి అక్కడ దేవిని ఆరాధిస్తే అనుకున్నది జరుగుతుందన్నది చాలా మంది భక్తుల నమ్మకం.
సాధారణంగా దేవభక్తి ఎక్కువగా ఉండే మంత్రి శ్రీరాములు కూడా తనకు డిప్యూటీ సీఎం పదవి కావాలి అంటూ అమ్మవారిని వేడుకున్నారు అన్నమాట. శ్రీరాములు రాసిన చీటీ సోషల్ మీడియాలో శుక్రవారం విపరీతంగా హల్ఛల్ చేస్తోంది.
మరోపక్క కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మూడురోజుల ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆశావాహులంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.పదవులు కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మంత్రి శ్రీరాములు మాత్రం ఇలా అమ్మవారికి అర్జీ పెట్టుకున్నారు.
అయితే అభిమానులు మాత్రం శ్రీరామలు కోరిక ఖచ్చితంగా తీరుతుందని గట్టిగా చెబుతున్నారు.మరి అమ్మవారు కరుణిస్తారో లేదో చూడాలి.