ఏపీలో అధికారపఠం మీద కూర్చున్న దగ్గర నుంచి జగన్ అన్ని విషయాల్లోనూ పారదర్శకత కోరుకోవడంతో పాటు, తమ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నారు.అంతేకాదు నాయకుల అవినీతి వ్యవహారాల కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా వస్తున్న క్రెడిట్ మొత్తం పోతుందని, అలాగే ప్రతిపక్షాలకు అనవసరంగా ప్రభుత్వంపై నిందలు వేసే అవకాశం కల్పించినట్లు అవుతుందని, ఇలా అనేక కోణాల్లో జగన్ విశ్లేషించుకుంటూ ఎప్పటికప్పుడు సొంత పార్టీ నాయకుల అవినీతి వ్యవహారాలను కట్టడి చేసుకుంటూ వెళుతున్నారు.
ఈ మధ్య కాలంలో తనకు అత్యంత సన్నిహితుడైన విశాఖ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి ని సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా జగన్ వెనకాడలేదు.ఇదిలా ఉంటే తాను వార్నింగ్ ఇచ్చినా, ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రుల పనితీరులో ఏ మాత్రం మార్పు లేదని, యథేచ్ఛగా అవినీతి వ్యవహారాల్లో మునిగితేలుతూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారనే విషయాన్ని జగన్ గుర్తించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడంతోపాటు, వారి వ్యవహారాలపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలు లో జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
![Telugu Ap Cm Jagan, Jagan, Mlas, Secrect, Ysrcp-Telugu Political News Telugu Ap Cm Jagan, Jagan, Mlas, Secrect, Ysrcp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2020/09/KOyya-Prasad-Reddy-Suspend-From-YSRCP.jpg)
కోట్లాది రూపాయల సొమ్ములు పార్టీ కోసం వెచ్చించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయించుకునేందుకు కూడా తమకు అవకాశం లేకుండా చేస్తున్నారని, ముఖ్యంగా ఇసుక తవ్వకాలు ఈ వ్యవహారంలో తమను దోషులుగా, అనుమానంగా చూస్తూ, ప్రజల ముందు చులకన అయ్యే విధంగా చేస్తున్నారు అని, ఇప్పటికే నియోజకవర్గాల్లో తమ ప్రమేయం లేకుండా, అన్ని కార్యక్రమాలను ప్రభుత్వ అధికారుల ద్వారా చేస్తున్నారని, ఎవరూ వివిధ పనుల నిమిత్తం తమ దగ్గరకు రావడం లేదు అని, ఇలా అయితే వచ్చే ఎన్నికల నాటికి తమ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకే పరిమితమైపోయమని, ఇప్పుడు చిన్న చితక పనులను తమ అనుచరులకు కేటాయించుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదని, పైగా తమపై నిఘా ఏర్పాటు చేసి వార్నింగ్ లు ఇస్తూ, భయాందోళనకు గురిచేస్తున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.