రాజన్న సిరిసిల్ల జిల్లా: వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై ప్రయాణికులు రాకపోకలు సాగించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఆదివారం కోనరావుపేట మండలం నిమ్మపల్లి నుండి మరిమడ్ల అలాగే నిజామాబాద్ నుండి మామిడిపెల్లి, చందుర్తి మండలం మూడపల్లి, మల్యాల గ్రామాల్లో రహదారుల మీద ప్రవహిస్తున్న వాగులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్( Collector Sandeep Kumar Jha, SP Akhil Mahajan ), అదనపు కలెక్టర్ ఎన్.
ఖీమ్యా నాయక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ముఖ్యంగా వాగులు ప్రవహిస్తున్న రహదారిపై ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా చూడాలని అన్నారు.
ఆయా వాగుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాచర్ ను నియమించామని పేర్కొన్నారు.గ్రామ పంచాయితీ కార్యదర్శి వాచర్ గా వ్యవహరిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.స్థానిక అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
జిల్లా పరిధిలోని ప్రయాణికులు రోడ్లపై ప్రవహిస్తున్న వాగులు దాటడానికి ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అన్నారు.
రెవెన్యూ, పోలీస్, పంచాయితీ, మున్సిపల్ విభాగాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.సమస్యలు ఉంటే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 కు ఫోన్ చేసి సంప్రదించాలని, అన్ని మండల కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ పర్యటనలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, కోనరావుపేట తహశీల్దార్ విజయ ప్రకాష్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.