జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకారంపై ప్రజలు భగ్గుమంటున్నారు.తమకు న్యాయం చేయాలంటూ నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనకు తమ వంతు మద్ధతు పలుకుతున్నారు.
ఈ క్రమంలో తోటి సభ్యుడిపై జాత్యహంకార ఆరోపణలు చేసి పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు భారత సంతతికి చెందిన సిక్కు ఎంపీ.
కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ)కి నేతగా వ్యవహరిస్తున్న జగ్మీత్ సింగ్ పార్లమెంట్లో ప్రతిపక్షనేతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తద్వారా ఈ పదవిని పొందిన తొలి మైనార్టీగా జగ్మీత్ గుర్తింపు పొందారు.ఈ క్రమంలో ఫెడరల్ పోలీస్ ఫోర్స్లో జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై సంతకానికి సంబంధించి జగ్మీత్… వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ సభ్యుడితో వాగ్వాదానికి దిగారు.
ఈ తీర్మానంపై బ్లాక్ క్యూబెకోయిస్ సభ్యుడు అలైన్ థెర్రియన్ సంతకం చేయడానికి నిరాకరించడంతో జగ్మీత్ సింగ్ అసహనానికి గురైయ్యారు.ఈ సమయంలో థెర్రియన్ది జాత్యహంకారమని వ్యాఖ్యానించారు.
దీనిపై బ్లాక్ క్యూబెకోయిస్ సభ్యులు అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది.ఇదే సమయంలో క్షమాపణలు చెప్పేందుకు సైతం జగ్మీత్ నిరాకరించారు.
దీంతో స్పీకర్ రోటా ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.ఆయన ఓ రోజు సభకు హాజరుకారాదని తెలిపారు.
దీనిపై జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ… తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాని తెలిపారు.థెర్రియన్ వైఖరితో తాను తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు.మరోవైపు ఈ మొత్తం వ్యవహరంలో థెర్రియన్కు బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ అధినేత వైవ్స్ ఫ్రాంకోయిస్ అండగా నిలిచారు.అంతేకాకుండా జగ్మీత్పై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఆయితే సిక్కు ఎంపీకి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అండగా నిలబడ్డారు.తొలుత వ్యవస్థలో ఉన్న జాత్యహంకారాన్ని గుర్తించి, పరిష్కరించడం ముఖ్యమని అన్నారు.
జగ్మీత్ సింగ్ కుటుంబం 1993లో భారత్ నుంచి కెనడాకు వలస వచ్చింది.న్యూ డెమోక్రటిక్ పార్టీ చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయన ఓంటారియా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.