కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతం భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే.ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్ధితి నెలకొంది.తాజాగా ఈ సెగ బ్రిటన్ను తాకింది.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రజలు లండన్లోని ఇండియన్ హైకమీషన్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలకు దిగారు.
అస్సాం ప్రజల భాష, సంస్కృతుల ఉనికిని దెబ్బతీసేలా ఉన్న ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రవాస అస్సామిలలో ప్రముఖుడైన కరుణ సాగర్ దాస్ తెలిపారు.
అంతకుముందు యూనివర్సిటీ విద్యార్ధులు, నిపుణులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఫేస్బుక్లో ‘‘అస్సామీ ఇన్ యూకే’’ పేరుతో గ్రూపు ఏర్పాటు చేశారు.
అస్సామీలందరూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నారని తాము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నామని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్కు చెందిన ఓ అస్సామీ పరిశోధనా విద్యార్ధి పేర్కొన్నాడు.తమ భాష, సంస్కృతికి ముప్పుగా ఉన్న చట్టాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ అంగీకరించమని అతను తేల్చి చెప్పాడు.మరోవైపు ఏఏఎస్యూ ప్రధాన సలహాదారు సముజ్జల్ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి లురిన్జ్యోతి గొగోయ్లు లండన్లోని అస్సామీ సమాజానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
అదే సమయంలో ఇతర దేశాల్లో స్థిరపడిన అస్సామీలు సైతం మద్ధతుగా నిలవాలని గొగోయ్ కోరారు.