రెండు ఇండో కెనడియన్ గ్రూపుల మధ్య గ్యాంగ్వార్ పెరుగుతున్న నేపథ్యంలో కెనడియన్ లా ఎన్ఫోర్స్మెంట్ శుక్రవారం పబ్లిక్ సేఫ్టీ వార్నింగ్ జారీ చేసింది. సర్రేలోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సదరు ముఠాలకు బాస్లుగా కర్న్వీర్ గార్చా (24), హర్కిరత్ జుట్టి (22)లుగా గుర్తించారు.
వీరు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని సర్రే నివాసితులుగా నిర్ధారించారు.వీరు నేరపూరిత కార్యకలాపాలకు , అధిక స్థాయి హింసకు సంబంధం వున్నవారని.
అందుచేత వారికి సమీపంలో వున్న వారు జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరించారు.ముఠా కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, కాల్పుల వంటి హింసాత్మక చర్యల కారణంగా ఈ వ్యక్తులు తమతో పాటు వారి కుటుంబాలను , సమాజాన్ని ప్రమాదంలో పడేశారని పోలీసులు జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రిటీష్ కొలంబియాలో ఇటీవల హింసాత్మక ఘటనలు పెరిగాయి.వీటిలో ఇండో కెనడియన్ల పాత్ర కూడా వున్నట్లు తేలిన నేపథ్యంలో కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందు పోలీసుల సేఫ్టీ వార్నింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇకపోతే.గతేడాది ఆగస్టులో ప్రజలకు ముప్పు కలిగించే ముఠాలతో సంబంధం వున్న 11 మంది వ్యక్తుల జాబితాను కంబైన్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ (సీఎఫ్ఎస్ఈయూ) విడుదల చేసింది.
వీరిలో తొమ్మిది మంది ఇండో కెనడియన్లు వుండగా వీరంతా పంజాబీ మూలాలు కలిగినవారే.కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలకు సంబంధించి భారత ప్రభుత్వం గతంలోనే ట్రాన్స్లోకేషనల్, ట్రాన్స్నేషనల్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కెనడాలో వున్న ఏడుగురు గ్యాంగ్స్టర్లు భారత్లో ముఠా కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నారని, అలాగే ఖలిస్తాన్ మద్ధతుదారులతో వారికున్న అనుబంధం గురించి కూడా ఇరుదేశాల దర్యాప్తు సంస్ధలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి.
ఈ తరహా గ్యాంగ్స్టర్ల జాబితాను సీఎఫ్ఎస్ఈయూ జారీ చేయడం వరుసగా ఇది రెండో ఏడాది.2021లో ఇలాంటి లిస్ట్లో చోటు దక్కించుకున్న వారిలో మెనింధర్ ధాలివాల్ కూడా ఒకడు.ఇతను 2022 జాబితాలో లేడు.
ఎందుకంటే జూలై 24న విస్లెర్ పట్టణంలో అతనిని కాల్చిచంపారు.ఈ ఘటనలో సతీండెరా గిల్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల గుర్సిమ్రాన్ సహోటా, 20 ఏళ్ల తన్వీర్ ఖాఖ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా.కెనడాలో వుంటూ పంజాబ్లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.ఇప్పటికే పలువురు గ్యాంగ్స్టర్లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.
వీరిలో లఖ్బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్స్టర్లంతా కెనడాలోనే వున్నారు.
.