భారత్- అమెరికాల మధ్య బంధం బలపడుతోన్న నేపథ్యంలో నార్త్ టెక్సాస్లోని డల్లాస్ నగరంలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని నెలకొల్పాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఇది ఈనాటిది కాదు.
ఇక్కడ స్థిరపడిన భారతీయ అమెరికన్లు ఎప్పటి నుంచో కాన్సులేట్ కార్యాలయం కోసం అభ్యర్ధిస్తున్నారు.ఇటీవల ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడటం, భారత్కు అమెరికా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ మరింతగా సౌండ్ చేస్తోంది.
వైవిధ్యానికి కేంద్రంగా వున్న డల్లాస్లో భారతీయ కాన్సులేట్ కార్యాలయాన్ని నెలకొల్పడం వల్ల ఇరుదేశాల మధ్య శక్తివంతమైన సంబంధాన్ని పెంచడంతో పాటు గణనీయమైన విలువను అందిస్తుందని ఇక్కడి ప్రవాస భారతీయులు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా స్థిరపడిన అమెరికన్ నగరాల్లో డల్లాస్ రెండో స్థానంలో వుంది.
అనేక వాణిజ్య సంస్థలతో పాటు ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా విస్తృతంగా సేవలు అందిస్తోంది.భారత్తో నేరుగా అనుసంధానమయ్యే ఇన్ని సౌకర్యాలు వుండటం చేత ఇక్కడ భారతీయ కాన్సులేట్ కార్యాలయం వుండాలని ప్రవాసులతో పాటు ఇండియన్ అమెరికన్ సీఈవో కౌన్సిల్ కోరుతోంది.
ఇందుకు అవసరమైన సహాయ సహాకారాలు తాము కూడా అందిస్తామని కౌన్సిల్ హామీ ఇచ్చింది.కాన్సులేట్ కార్యాలయం ప్రతిపాదన కార్యరూపం దాల్చితే.
భారత్- అమెరికా మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడతాయి.అదే సమయంలో వ్యూహాత్మక భాగస్వామ్యంలో డల్లాస్ ఒక ప్రాథమిక కేంద్ర బిందువుగా మారేందుకు కూడా అవకాశం వుంది.
అమెరికా, డల్లాస్ పౌరులకు కూడా ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమమౌతుంది.
ఇకపోతే.డల్లాస్- ఫోర్ట్ వర్త్లో దాదాపు 1,45,000 మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా.ఇక్కడ స్థిరపడిన వారిలో అత్యధికులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ప్రొఫెషనల్సే.
ఐటీ బూమ్ బాగా విస్తరించిన 2000- 2010 కాలంలో ఇక్కడికి భారత్ నుంచి వలసలు ఎక్కువగా పెరిగాయి.హెచ్ 1 బీ వీసాలు పొంది.ఆపై గ్రీన్కార్డ్ సంపాదించిన వారే వీరంతా.అలాగే ఇక్కడి సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్లలో చదువుకోవడానికి వచ్చిన భారతీయులు చదువు పూర్తి చేసి ఇక్కడే స్థిరపడిపోతున్నారు.
ఇక్కడి బంధువులు, సన్నిహితుల ద్వారా భారత్లోని యువత డల్లాస్కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.