ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఏపీ తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీతో తీగెగతెంపులు చేసుకున్న టీడీపీ మైనార్టీల ఓట్లు గంపగుత్తగా కొట్టేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది.
అందుకే కొద్ది రోజుల క్రితం నారా హమారా – టీడీపీ హమారా అంటూ సభ పెట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అలాగే ఏపీ క్యాబినెట్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించేలా వారికి మంత్రి పదవి ఇచ్చేందుకు క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని బాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
మంత్రివర్గ విస్తరణను ఆగస్టు నెలలోనే చేపట్టాల్సి ఉందని, తన బావమరిది, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు అయిన హరిక్రిష్ణ హఠన్మరణంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.
ఈ విస్తరణలో ఇద్దరు ముగ్గురు ఆశావహుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.అయితే ఇన్ని రోజులు ఊహాగానాలుగానే ఉన్న ఈ మంత్రివర్గ విస్తరణ మీద చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.తవరలో ఏపీలో కేబినెట్ విస్తరణ ఖాయమని, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పారు.
నిన్న అమరావతిలో మాట్లాడిన సీఎం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కాస్త ఆలస్యమైందని అన్నారు. కేబినెట్ రేసులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ పేరు బలంగా వినిపిస్తోందట.
అలాగే అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్పాషా పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోందట.వీరిద్దరు మాత్రమే కాదు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయట.
అలాగే కొందరు శాసనసభ్యుల పనితీరు ఆధారంగా వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు.
ఇదే జరిగితే పార్టీలో కొందరు అలకబూనే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుత క్యాబినెట్లోవైసీపీ నుంచి వచ్చి మంత్రులైన వారిలో కొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు.
ఇందులో మొదటి పేరు పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ ఉన్నారట.ఆమె పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
అలాగే విజయనగరం జిల్లాకు చెందిన మరో మంత్రి సుజన రంగారావుకు కూడా మంత్రివర్గం నుంచి స్వస్తి పలికే అవకాశం ఉందంటున్నారు.
ఈ ఇద్దరి స్ధానంలో మరో ఇద్దరు వైసీపీ నుంచి వలస వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటున్నట్లు చంద్రబాబు సన్నిహితులు చెబుతున్నారు.ఇక మహిళ ఓట్ల కోసం మరో మహిళకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.అలాగే ఎస్సీల ఓట్ల కోసం కూడా మరో ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అమరావతిలో టాక్ నడుస్తోంది.
అయితే ఎన్నికల సమయంలో ఈ విస్తరణ చేపడితే అసమ్మతి రేగి అనవసర తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
.