ఏపీలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన పదవిలో సంతృప్తిగా ఉండలేకపోతున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన తన ఎమ్మెల్యే సీటు వదులుకుని ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టంగా ఉన్నారా ? అంటే ఆయన వ్యాఖ్యలు అవుననే చెపుతున్నాయి.గుంటూరు జిల్లాలో గత రెండు ఎన్నికల్లోను టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచారు మోదుగుల వేణుగోపాల్రెడ్డి.2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
రాయపాటి సాంబశివరావు కోసం నరసారావుపేట ఎంపీ సీటును వదులుకున్న మోదుగుల గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవి ఆశించారు.
మొన్న జరిగిన ప్రక్షాళనలో సైతం ఆయన ఆశలు నెరవేరలేదు.ఇక నియోజకవర్గంలో కూడా ఆయనకు సరైన పట్టులేకుండా పోయింది.ఆయన నియోజకవర్గంలో ఉన్న మిర్చి యార్డు చైర్మన్తో పాటు స్టేడియం పాలకవర్గ కమిటీ విషయంలో సైతం ఆయన మాట చెల్లుబాటు కాలేదు.
దీంతో ఎమ్మెల్యేగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదనకు గురవుతోన్న మోదుగుల వచ్చే ఎన్నికల్లో తిరిగి నరసారావుపేట ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు.
ఈ విషయాన్ని మోదుగుల స్వయంగా వెల్లడించారు.ఇదే అంశంపై ఆయన మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పార్టీ అవకాశం ఇస్తే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని ఉందన్నారు.
మోదుగుల వ్యాఖ్యలను బట్టి ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విముఖంగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది.
అయితే చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.