ఒకరేమో వైసిపి తరపున రాజ్యసభలో గళం ఎత్తుతున్న ఎంపీ.మరొకరేమో టిడిపి నుంచి రాజ్యసభకు నామినేటెడ్ అయ్యి బీజేపీలో చేరిన ఎంపీ.
ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర స్థాయిలో వార్ జరుగుతోంది.ఆ ఇద్దరిలో ఒకరు విజయ సాయి రెడ్డి కాగా మరొకరు సుజనా చౌదరి.
తెలుగుదేశం పార్టీలో సుజనా చౌదరి ఉన్నప్పటి నుంచి వైసిపి ఆయనను టార్గెట్ చేస్తూనే ఉంది.అలాగే సుజనా చౌదరి కూడా టిడిపిలో ఉన్నా బిజెపిలో ఉన్నా తమ పార్టీ బీజేపీ వైసీపీకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా విమర్శలు ఎక్కు పెడుతూనే ఉన్నాడు.
తెలుగుదేశం పార్టీకి మేలు జరిగేలా వైసీపీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తుండడం వైసీపీకి ఆగ్రహం తెప్పిస్తోంది.ఈ నేపథ్యంలోనే సుజనాచౌదరి ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ విచారణ చేయించాలని గతంలో విజయ సాయి రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు.
తాజాగా ఈ లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి హోం శాఖకు దానిని పంపిస్తున్నట్టుగా విజయసాయి రెడ్డి కి లేఖ ద్వారా తెలియజేశారు.దీనిపై సుజన చౌదరి విజయసాయి రెడ్డి మధ్య వార్ తీవ్రస్థాయిలో మొదలైంది.16 నెలల పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టిన విజయసాయిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.రాష్ట్రపతి కార్యాలయానికి ఎవరు ఫిర్యాదు చేసినా దానిని సంబంధిత శాఖకు రాష్ట్రపతి కార్యాలయం పంపిస్తుందని, ఇదంతా సర్వసాధారణం అని, విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని పట్టుకుని తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తన జీవితం, తన వ్యాపారాలు, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అంటూ సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఫైనల్ తీర్పుకోసం, ఆ తీర్పుతో పడే శిక్ష కోసం ఎదురుచూస్తున్న కన్ఫాడ్ క్రిమినల్ విజయసాయిరెడ్డి అంటూ సంచలన విమర్శలు చేశారు.