గ్రేటర్ ఎన్నికల్లో పైచేయి సాధించాలని , కారు జోరు మరోసారి చూపించి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయాలని, టిఆర్ఎస్ పార్టీ ఎన్నో వ్యూహాలు రచిస్తూ వచ్చింది.ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు.నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ, అనేక హామీలు ఇస్తూ, ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రేటర్ లో అభివృద్ధి పనుల నిమిత్తం ఎన్ని వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందో, ఎంత అభివృద్ధి సాధించిందో అన్నిటిని జనాలకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తూ, జనాల్లో పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలను టిఆర్ఎస్ దక్కించుకుంది.
ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్, బిజేపి లకు గట్టి ఝలక్ ఇవ్వాలని భావిస్తూ, ఎన్నో రకాలుగా పైచేయి సాధించేందుకు చూస్తూ ఉండగా, అకస్మాత్తుగా విరుచుకుపడిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ ను ముంచెత్తాయి.కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో కురిసిన వర్షాలు జన జీవితాలను అతలాకుతలం చేశాయి.
వీధులన్నీ పొంగి పొర్లుతూ, కార్లు బైకులు సామాన్లు ఇలా అన్నీనీళ్లపాలు అయ్యేలా చేసాయి.ఇప్పటికీ నగరంలో ముంచెత్తిన వానలతో జనజీవనం పడుతున్నఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.
దీంతో సాధారణంగానే ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది.
వేల కోట్లతో గ్రేటర్ లో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, ముందు చూపుతో డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నా, వాటిని తొలిగించకపోవడం వంటి కారణాలతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని జనాలంతా భావిస్తుండటం, ప్రతిపక్షాలు సైతం ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ హడావుడి చేస్తున్న తీరుతో ఇప్పుడు టిఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తున్నాయి.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కవిత గెలవడంతో మంచి ఊపు మీద ఉన్న టిఆర్ఎస్ కు అనుకోని విధంగా గ్రేటర్ పరిధిలో వచ్చిన వరదలు తమ ఆశలను అడియాసలు చేస్తుందనే భయం పెరిగిపోతోంది.ముఖ్యంగా కేటీఆర్ బాగా టెన్షన్ పడుతున్నారట.
త్వరలోనే సీఎం కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నఆయన గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడించి ఆ ఉత్సాహంతో సీఎం కుర్చీలో కూర్చోవాలని చూస్తుండగా, ఈ భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిపోతుందనే ఆందోళన అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.