తమ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం లో పెద్దగా బలం లేకపోయినా, ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భావించారు.తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దించక పోయినా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను పోటీకి దించాలని, దీని ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆమె భావించారు.
ఈ విధంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను హుజురాబాద్ లో తమ పార్టీ సహకారంతో బరిలో దింపాలని షర్మిల భావించారు .దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .అంతేకాదు అభ్యర్థులకు అవసరమైన డిపాజిట్ ఖర్చులు అన్ని తామే భరిస్తాము అంటూ ఆమె ప్రకటించారు.కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు .
ఒక్కరు కూడా ఈ విధంగా నామినేషన్ వేయలేకపోయారు .దీంతో షర్మిల వ్యూహం బెడిసి కొట్టినట్లు అయ్యింది.షర్మిల ఇచ్చిన పిలుపును నిరుద్యోగులు పట్టించుకోలేదు అనే ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయింది.అసలు షర్మిల నిరుద్యోగుల కోసం ఎక్కువగా పోరాడుతున్నారు.ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ యువతను ఆకట్టుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు.కానీ ఆమె పోరాటాలను నిరుద్యోగులు పట్టించుకోలేదు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
షర్మిల పార్టీ మాత్రం దీనిని కొట్టిపారేస్తోంది.
పెద్ద ఎత్తున నిరుద్యోగులు నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారని, అయితే ఇతర నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హుజురాబాద్ లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా ఆర్డీవో డిక్లరేషన్ తీసుకోవాలని, కానీ ఆ డిక్లరేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది అని, ఎక్కడలేని నిబంధనలు చూపించి వారికి డిక్లరేషన్ ఇవ్వలేదని షర్మిల ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.తమ పార్టీ మద్దతుతో నిరుద్యోగులు నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది అని , అరెస్టులు చేస్తున్నారని , వారికి మద్దతిచ్చే వాటిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని , ఎన్నికల కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు లో వైయస్సార్ టిపీ ఫిర్యాదు చేసింది.
ఏదైతేనేం చివరకు షర్మిల హుజురాబాద్ ఎన్నికల కోసం వేసిన వ్యూహం మాత్రం బెడిసికొట్టింది.
.