అమెరికా- కెనడా సరిహద్దుల్లో చలికి తట్టుకోలేక ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు మరణించిన ఘటనపై కేంద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ విషయం తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.
యూఎస్, కెనడాలోని భారత రాయబారులతో మాట్లాడారు.అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు, కెనడాలోని ఇండియన్ హైకమిషనర్ అజయ్ బిసారియాతో జైశంకర్ మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అక్కడి పరిస్థితులపై తక్షణం స్పందించాలని వారిని ఆదేశించినట్లు పేర్కొంది.చలికి గడ్డకట్టుకుపోయి నలుగురు చనిపోయిన విషయాన్నికెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ధ్రువీకరించారు.
భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారుల బృందం టోరంటో నుంచి మనిటోబాకు వెళ్లిందని బిసారియా తెలిపారు.ఈ దిగ్భ్రాంతికర ఘటనపై విచారణలో కెనడా అధికారులతో కలిసి పనిచేస్తున్నాం అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా.యూఎస్ – కెనడా సరిహద్దుల్లో అంతర్జాతీయ సరిహద్దును దాటే క్రమంలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు గడ్టకట్టిన స్థితిలో శవాలుగా తేలారు.బుధవారం ఉదయం.మానిటోబా ప్రావిన్స్లోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ)లకు కెనడా నుంచి యూఎస్లోకి ప్రవేశించిన వ్యక్తులను యూఎస్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నట్లుగా సమాచారం అందింది.
మానిటోబాలోని ఎమర్సన్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.దాదాపు నాలుగు గంటల తర్వాత స్థానిక కాలమానం ప్రకారం.మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులు .కెనడా సరిహద్దులో మూడు మృతదేహాలను కనుగొన్నారు.ఇవి ఎమర్సన్ పట్టణానికి సమీపంలో కనుగొన్నారు.అయితే ఇంకెవరైనా వున్నారేమోనన్న అనుమానంతో చుట్టుపక్కల గాలించగా… మరో పురుషుడి మృతదేహం దొరికింది.
అమెరికాలోని మిన్నెసోటా జిల్లాలోని స్టేట్ అటార్నీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.కెనడియన్ సరిహద్దుకు దక్షిణంగా దాదాపు పావు మైలు దూరంలో ఐదుగురు భారతీయులు.
లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తారసపడ్డారని తెలిపింది.ఎవరో ఒకరు తమను తీసుకెళ్తారని భావించి సరిహద్దు గుండా దాదాపు 11 గంటలకు పైగా నడిచారని అటార్నీ కార్యాలయం తెలిపింది.
వారిలో ఒకరి వద్ద వున్న బ్యాగ్లో పిల్లల బట్టలు, డైపర్, బొమ్మలు, మందులు వున్నట్లు వెల్లడించింది.
ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కెనడా వైపున నాలుగు మృతదేహాలను కనుగొన్నట్లు.యూఎస్బీపీ అధికారులకు కెనడా పోలీసులు సమాచారం అందించారు.ఈ నలుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందినవారివిగా పోలీసులు గుర్తించారు.
ఫ్లోరిడాకు చెందిన స్టీవ్ షాండ్ అనే 47 ఏళ్ల వ్యక్తి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని విదేశీ పౌరులను అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్న నేరంపై అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.మరణించిన నలుగురిలో ఒక చిన్నారి, యువకుడు, ఒక పురుషుడు, స్త్రీ వున్నారు.
వీరి వివరాలను గుర్తించాల్సి వుంది.వీరు సరిహద్దులను దాటే సమయంలో ఉష్ణోగ్రత -35 డిగ్రీలు వుందని అది ఏ మాత్రం మంచి పరిస్ధితి కాదని పోలీసులు చెబుతున్నారు.
ఎముకలు కొరికే చలితో పాటు భారీ మంచు తుఫానులు, ఎదురుగా ఏముందో కనిపించనంత చీకటి వుంటుందని వారు తెలిపారు.